బంధుమిత్రుల కోలాహలం, పెళ్లి బాజాల సందడి, ఎటు చూసినా నవ్వులు.. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరిగిన వివాహ వేడుకలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడపాల్సిన బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. ఒక వివాహ వేడుక కోసం ఒక కుటుంబం చిలుకూరులోని రిసార్ట్కు చేరుకుంది. బంధువులందరూ పలకరింపులు, వేడుక పనుల్లో నిమగ్నమై ఉండగా.. 15 ఏళ్ల బాలుడు తోటి పిల్లలతో కలిసి రిసార్ట్ పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు సరదాగా స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ఆడుకుంటూ అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఆ బాలుడు బయటకు రాలేకపోయాడు.
ఆలస్యంగా వెలుగులోకి..
కాసేపటి వరకు బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రిసార్ట్ అంతా వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్లో బాలుడు విగతజీవిగా పడి ఉండటం గమనించి ఒక్కసారిగా హతాశులయ్యారు. వెంటనే బాలుడిని నీటిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే ఆడుకుంటూ తిరిగిన పిల్లాడు శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి ఇల్లు కాస్తా స్మశాన వైరాగ్యాన్ని తలపించింది.
సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? పూల్ వద్ద రక్షణ చర్యలు లేదా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటనతో రిసార్టుల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. వేడుకల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు, రిసార్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.