GHMC: రాష్ట్రంలో అత్యధిక జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవల నిర్వహణ చేపట్టిన దేశంలోని అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ(GHMC) తీసుకునే నిర్ణయాల్లో ప్రజాపాలన భాగస్వామం నేటితో ముగిసి, బుధవారం నుంచి స్పెషలాఫీసర్ పాలన మొదలుకానుంది. అయిదేళ్లు పాటు పవర్ లోనున్న పాలక మండలి పెద్దలు మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు కౌన్సిల్ సభ్యులుగా వ్యవహారించిన కార్పొరేటర్లు తాజాగా మాజీలుగా మిగలనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో మరోసారి రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ 2 వేల 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలన్న సర్కారు నిర్ణయానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్టే. అయితే బుధవారం నుంచి మొదలుకానున్న స్పెషలాఫీసర్ పాలనకు అదే రోజు సర్కారు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే ఇంకా మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా, పాలక మండలి గడువు ముగిసిన తర్వాత వికేంద్రీకరణ చేస్తూ మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. మొత్తం 300 వార్డులుగా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో అదనంగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే 150 వార్డులతో జీహెచ్ఎంసీని కొనసాగిస్తూనే మిగిలిన 150 వార్డుల్లో 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్, మరో 74 వార్డులతో గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే తార్నాకలోని పాత హెచ్ఎండీఏ ఆఫీసు భవనానికి గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిష్నరేట్ అంటూ బోర్డును ఏర్పాటు చేయటం విశేషం. దీనికి తోడు మాదాపూర్ లోని న్యాక్ భవన్ లో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిష్నరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు అదనపు కమిషనర్లుగా వ్యవహారిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డిలనే ఆ రెండు కార్పొరేషన్లుకు స్పెషలాఫీసర్లుగా నియమించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత అవసరమైతే వీటిల్లోని వార్డులను పునర్విభజించి, రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించే వరకు వారే స్పెషలాఫీసర్లుగా కొనసాగి, ఆ తర్వాత ఆ ఇద్దరు అధికారులే రెండు కార్పొరేషన్లకు కమిషనర్లుగా వ్యవహారించనున్నట్లు తెలిసింది.
పట్టణ స్థానిక సంస్థల విలీనంతో 60 సర్కిల్లు, 12 జోన్లు, 300 వార్డులుగా విస్తరించిన జీహెచ్ఎంసీకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ ను స్పెషలాఫీసర్ గా నియమించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఒక కార్పొరేషన్, త్వరలో అదనంగా ఏర్పడనున్న మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి, పాలక మండలి పవర్ లోకి వచ్చి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నకునేంత వరకు జయేష్ రంజన్ స్పెషలాఫీసర్ గా కొనసాగనున్నట్లు తెలిసింది. అయితే మూడు కార్పొరేషన్లలోనూ అతి పెద్ద కార్పొరేషన్ గా మిగలనున్న జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్ గా జయేష్ రంజన్ ను కొనసాగిస్తూనే ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నే కొనసాగిస్తారా? లేక వేరే అధికారిని కమిషనర్ నియమిస్తారా? అన్న ఉత్కంఠకు సైతం మరో కొద్ది గంటల్లో తెరపడనున్నట్లు తెలిసింది.
Also Read: Collector BM Santhosh: శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ సంతోష్!