ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, అదే ఫోన్ సవాలక్ష ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. తాజాగా ఒక బాలుడు చేసిన చిన్న తప్పు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక మొబైల్ సర్వీస్ సెంటర్లో ఫోన్ బ్యాటరీని నోటితో కొరకడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ భీభత్సమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక బాలుడు తన ఫోన్ రిపేర్ కోసం సర్వీస్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ ఫోన్ బ్యాటరీని పరిశీలిస్తూ, అది అసలైనదా కాదా అని చెక్ చేసే క్రమంలోనో లేక అమాయకత్వంతోనో దానిని పళ్లతో గట్టిగా కొరికాడు. బ్యాటరీపై ఒత్తిడి పడగానే అందులోని రసాయనాలు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యాయి. కొరికిన సెకను వ్యవధిలోనే బ్యాటరీ నుండి మంటలు వచ్చి పేలిపోయింది. ఆ ధాటికి బాలుడి నోరు, ముఖం తీవ్రంగా గాయపడ్డాయి. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ బాలుడి తెలివితక్కువతనాన్ని విమర్శిస్తుంటే, మరికొందరు ఈ కాలం పిల్లలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం, రీల్స్ చేయడం కోసం ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ‘లిథియం బ్యాటరీలు బాంబులతో సమానం, వాటితో పరిహాసమా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p
— Rosy (@rose_k01) February 5, 2026
నిపుణుల సూచనలు..
సాధారణ బ్యాటరీలకు, మొబైల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు చాలా తేడా ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతమైనవి. సున్నితమైనవి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. బ్యాటరీ విషయంలో ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి:
ఒత్తిడి వద్దు: బ్యాటరీని ఎప్పుడూ కొరకడం, వంచడం లేదా పదునైన వస్తువులతో గుచ్చడం చేయకూడదు.
ఉబ్బిన బ్యాటరీలు: ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ కొద్దిగా ఉబ్బినట్లు కనిపిస్తే, దానిని వెంటనే వాడటం ఆపేసి సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి.
పిల్లలకు దూరం: ఎలక్ట్రానిక్ వస్తువులను, విడి బ్యాటరీలను పిల్లలకు అందకుండా జాగ్రత్త చేయాలి.
రీసైక్లింగ్: పనికిరాని బ్యాటరీలను చెత్తలో పడేయకుండా, ఇ-వేస్ట్ రీసైక్లింగ్ సెంటర్లలో అప్పగించాలి.
లిథియం బ్యాటరీలలో ఉండే రసాయనాలు గాలితో లేదా తేమతో కలిసినప్పుడు విస్ఫోటనం చెందుతాయి. ఈ సంఘటన ద్వారా టెక్నాలజీని వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి అర్థమవుతోంది. ఒక్క చిన్న పొరపాటు జీవితాంతం మాయని గాయాన్ని మిగిలిస్తుంది.
ALSO READ: Revanth Reddy: కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా..