Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు అండగా నిలిచింది. ఇటీవల గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, అలాగే గతేడాది అక్టోబర్లో దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు తలో రూ. కోటి చొప్పున ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు. నిజామాబాద్లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ఆయా కుటుంబ సభ్యులకు ఈ చెక్కులను సీఎం అందజేశారు.
నిజామాబాద్ జిల్లాలో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సాహసోపేతంగా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఆ ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సౌమ్య చూపిన ధైర్యసాహసాలను ప్రభుత్వం గుర్తించి, ఆమె కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు, గతేడాది అక్టోబర్లో విధి నిర్వహణలో ఉండగా అసాంఘిక శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంది. నిందితులను పట్టుకునే క్రమంలో దుండగులు జరిపిన కత్తిపోట్ల వల్ల ఆయన మరణించారు. ప్రాణాలు పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నించే సిబ్బందికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఈ వీర కానిస్టేబుళ్ల త్యాగం మరువలేనిదని, వారి కుటుంబాలకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.