Cement Drum Murder Plot: నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వ్యక్తులపై పెంచుకునే వ్యామోహం, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, చివరకు హత్యలు.. ఘోరమైన నేరాలకు దారితీస్తున్నాయి. భాగస్వామిని అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ వేయడం.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీయడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యమయ్యాయి. వార్తాపత్రికల్లో చూస్తున్న ‘సిమెంట్ డ్రమ్ములో శవం’.. ‘ముక్కలుగా నరికిన శరీర భాగాలు’ వంటి వార్తలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలాంటిదే ఒక భయంకరమైన కుట్రను పసిగట్టిన ఓ భర్త.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి భార్యను ప్రియుడి వద్దకే సాగనంపిన విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య.. ఆరు నెలల కొడుకుతో కలిసి నివాసముంటున్నాడు. గత కొంతకాలంగా తన భార్య ప్రవర్తనలో మార్పు రావడం.. ఆమె తరచుగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించిన రాజ్ కుమార్ ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె తనకు ఒక ప్రియుడు ఉన్నాడని.. అతనితోనే కలిసి వెళ్ళిపోతానని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఈ క్రమంలో అనుమానం వచ్చి భార్య ఫోన్ను పరిశీలించిన రాజ్ కుమార్కు గుండె ఆగిపోయినంత పనైంది. అందులో ఆమె తన ప్రియుడికి పంపిన మెసేజ్లు చూసి అతడు వణికిపోయాడు. “సిమెంట్ డ్రమ్ము సిద్ధం చేశాను.. ఇక నీదే ఆలస్యం” అంటూ ఆమె తన ప్రియుడికి పంపిన సందేశం చూసి.. తనను చంపి సిమెంట్ డ్రమ్ములో పాతేయడానికి ప్లాన్ చేసిందని గ్రహించాడు.
వెంటనే భయంతో పోలీసులను ఆశ్రయించిన రాజ్ కుమార్.. తన భార్య చేస్తున్న కుట్రను వివరించాడు. పోలీసులు భార్యభర్తలిద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏం చేద్దామని పోలీసులు ప్రశ్నించగా.. రాజ్ కుమార్ చెప్పిన సమాధానం విని అందరూ అశ్చర్యపోయారు. “నేను ఇంకొన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకాలనుకుంటున్నాను. ఈమెతో కాపురం చేసి.. రేపు పొద్దున సిమెంటు డ్రమ్ములో శవమై ముక్కలుగా మారే బదులు.. ఈమెను వదిలేయడమే మేలు” అని రాజ్ కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆమెను తన ప్రియుడి వద్దకే పంపించేయాలని.. తనకు ప్రాణభిక్ష పెడితే చాలని పోలీసులను వేడుకున్నాడు.
దీంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక.. సదరు మహిళను ఆమె కోరుకున్నట్లుగానే ప్రియుడి వద్దకు పంపించేశారు. ప్రాణాలతో బయటపడ్డాననే ఊపిరి పీల్చుకుంటూ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయాడు. భాగస్వామి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటనలు ఎన్నో చూస్తుంటాం.. కానీ ఇలా తన ప్రాణం మీదకు వస్తుందని ముందుగానే పసిగట్టి.. భార్యను ప్రియుడి వద్దకే పంపించిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Tamil Nadu Road Accident: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పసికందు సహా 8 మంది మృతి.