Penukonda Accident: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియా పరిశ్రమ సమీపంలో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడినవారు శ్రీ సత్యసాయి జిల్లా నార్నేవారిపల్లికి చెందిన కుటుంబ సభ్యులు. వీరు ఓ శుభకార్యం ముగించుకొని పెన్నహోబిలం నుంచి బెంగళూరు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డులోని డివైడర్ వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో.. కారు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పెనుగొండ పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
Also Read: చెట్టును ఢీకొన్న కారు.. స్పాట్లో ఇద్దరు మృతి
ప్రమాద స్థలంలో కొంతసేపు వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.