Fire Accident: రంగారెడ్డి జిల్లాలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. భవన నిర్మాణ సంస్థ సమీపంలో కార్మికులకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా విస్తరించిన మంటలు ఒక గుడిసె నుంచి మరో గుడిసెకు వ్యాపించడంతో కొద్ది నిమిషాల్లోనే మొత్తం ప్రాంగణం మంటలతో అల్లకల్లోలంగా మారింది.
Also Read: మరో కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. గుడిసెల్లో వంట గ్యాస్ లీక్ కావడం కానీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగివుండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం అసలు కారణం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుడిసెల్లో నివసించే కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.