Serial Killer: ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్ జిల్లాలో ఓ సైకో కిల్లర్ తీవ్ర కలకలం సృష్టించాడు. 4 నెలల వ్యవధిలో 8 మందిని గుట్టుచప్పుడు కాకుండా చంపి.. పోలీసులకే షాకిచ్చాడు. హత్య చేయడమే కాకుండా మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటూ.. బాధిత కుటుంబానికి నిందితుడు సాయం చేస్తూ వచ్చాడు. తనపై అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. చివరికి పోలీసులు అరెస్టు చేయడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బలోదాబజార్ జిల్లా కస్టోల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖర్వే గ్రామంలో ఈ వరుస హత్యలు చోటుచేసుకున్నాయి. 46 ఏళ్ల నిందితుడు రామ్ సహాయ్ జైస్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య ఈ ఎనిమిది హత్యలు చోటుచేసుకున్నారు. చిన్న చిన్న వివాదాల కారణంగా మద్యంలో బోరాక్స్ పొడిని కలిపి ఈ హత్యలను జైస్వాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తొలుత వీటన్నింటిని సహజ మరణాలుగా వారి కుటుంబ సభ్యులు భావించారు. వారి అంత్యక్రియలు సైతం జరుగుతున్న సమయంలో జైస్వాల్ అక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి సాయం చేశాడు.
అయితే గ్రామంలో అనుమానస్పదంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం, జైస్వాల్ పై గ్రామస్తులకు అనుమానం రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కస్టోల్ పోలీసులు.. రంగంలోకి దర్యాప్తు ప్రారంభించారు. మే 14న చివరిగా జైస్వాల్ చేతిలో మరణించిన మహేతారు సాహు మృతదేహాన్ని జూన్ 13న పోలీసులు వెలికితీశారు. అనంతరం మరో 6 మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ ఓపీ శర్మ తెలిపారు. మరోవైపు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మృతులందరినీ తానే హత్య చేసినట్లు జైస్వాల్ అంగీకరించాడు.
మృతులతో ఉన్న పాత వివాదాలు, మాటల యుద్ధం, ఆర్థిక లావాదేవీలు, మనస్పర్థల కారణంగా వారిని హత్య చేసినట్లు జైస్వాల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. ఎలుకలు చంపేందుకు అని చెప్పి దుకాణంలో బోరాక్స్ పొడిని కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ పౌడర్ ను ముందుగా ఓ కుక్కపై జైస్వాల్ ప్రయోగించాడు. అది చనిపోవడంతో తనతో వివాదం పెట్టుకున్న వారిని టార్గెట్ చేశాడు. ఫిబ్రవరి 6న బోరాక్స్ పొడి కలిపిన మద్యం ఇచ్చి మెుదటి హత్యకు జైస్వాల్ పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 20న భూతాల్, మార్చి 12న ఛట్టు రామ్, మార్చి 20న బుధ్రామ్, మార్చి 31న వినోద్ కుమార్, ఏప్రిల్ 28న గజానంద్, ఏప్రిల్ 29న చైతు రామ్, మే 14న మహేతరు రామ్ ను హత్యలు చేసుకుంటూ జైస్వాల్ వచ్చాడు.
Also Read: రూ.18 వేలలో ఈ రేంజ్ ఫీచర్లా? ఇవి కదా మిడిల్ క్లాస్ మెచ్చే.. పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్లు!
అయితే జైస్వాల్ విషం ఇచ్చిన అందరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు. కార్తీక్ అనే వ్యక్తి.. విషం కలిపిన మద్యం తాగినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీనా ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే కోలుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే నిందితుడు బాధితుల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లడంలో సాయం చేయడం, అంత్యక్రియల్లో చేదోడువాదోడుగా ఉండటంతో ఇన్ని హత్యలు జరిగినప్పటికీ జైస్వాల్ పై ఎవరికీ అనుమానం కలుగలేదని జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు. మెుత్తంగా నిందితుడిపై 8 హత్యలు, ఒక హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు.
Also Read: ఏసీ బాక్స్కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!