Zero-Emission Hydrogen Train: ప్రపంచ రైల్వే రంగంలో మరో కీలక ముందడుగు పడింది. స్విట్జర్లాండ్ కు చెందిన రైళ్ల తయారీ సంస్థ స్టాడ్లర్, ఇటలీలోని సార్డీనియా రవాణా సంస్థ ARSTతో కలిసి ప్రపంచంలోనే తొలి నారో గేజ్ హైడ్రోజన్ రైలును రూపొందిస్తోంది. ప్రస్తుతం డీజిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్న నారో గేజ్ రైల్వే మార్గాలను పూర్తిగా కాలుష్య రహితంగా మార్చేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
ఈ హైడ్రోజన్ రైళ్లు 2028 నుంచి ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. మొదటి దశలో సార్డీనియాలోని అల్ఘెరో విమానాశ్రయం-మముంటానాస్, సస్సరి-అల్ఘెరో, సస్సరి-సోర్సో మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి 2,100 టన్నులకు పైగా కర్బన్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.
ఇటలీలో నారో-గేజ్ రైల్వే మార్గాలు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లపైనే నడుస్తున్నాయి. ఈ మార్గాల్లో ఉన్న ఇరుకైన మలుపులు, బరువు పరిమితుల కారణంగా సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లను నడపడం సాధ్యం కాదు. అందుకే ప్రత్యేకంగా తక్కువ బరువుతో పనిచేసే హైడ్రోజన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ రైళ్లలో హైడ్రోజన్ ట్యాంకులు, ఫ్యూయల్ సెల్ వ్యవస్థలు ప్రత్యేక పవర్ ప్యాక్ లో అమర్చబడి ఉంటాయి. ఇవి రైలులోని బ్యాటరీలకు విద్యుత్ సరఫరా చేస్తాయి. దీంతో ఎలాంటి డీజిల్ అవసరం లేకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో రైళ్లు నడుస్తాయి.
ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ హైడ్రోజన్ ను 100 శాతం సౌరశక్తిని ఉపయోగించి స్థానికంగానే తయారు చేస్తారు. ఉత్పత్తి నుంచి వినియోగం వరకు మొత్తం ప్రక్రియ పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రైళ్లు ప్రయాణించే సమయంలో నీటి ఆవిరి తప్ప ఎలాంటి కాలుష్య వాయువులను విడుదల చేయవు. ప్రయాణికులకు కూడా ఈ కొత్త రైళ్లు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనున్నాయి. డీజిల్ ఇంజిన్లలో ఉండే శబ్దం, ప్రకంపనలు ఇందులో ఉండవు. విశాలమైన విండోలు, ఎయిర్ కండిషనింగ్, లో ఫ్లోర్ బోర్డింగ్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సిబ్బందికి ప్రత్యేక ఎంట్రీలు, క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టాడ్లర్ సంస్థ సార్డీనియాకు మొత్తం పది హైడ్రోజన్ రైళ్లను సరఫరా చేయనుంది. ఇటలీలోని ఇతర ప్రాంతాలు కూడా ఇదే తరహా రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కలాబ్రియా ప్రాంతానికి తొమ్మిది రైళ్లు, సిసిలీకి మరో రెండు రైళ్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు స్విట్జర్లాండ్ లోని స్టాడ్లర్ ప్రధాన కేంద్రంలో తయారవుతున్నాయి. ప్రయాణికుల సేవల్లోకి వచ్చే ముందు భద్రతా పరీక్షలు, సాంకేతిక పరిశీలనలను పూర్తిచేయాల్సి ఉంటుంది. డీజిల్ యుగానికి ముగింపు పలుకుతూ, స్వచ్ఛమైన ఇంధనంతో నడిచే ఈ హైడ్రోజన్ రైళ్లు ప్రపంచ రైల్వే రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.
Read Also: బుల్లెట్ రైళ్లు సాధారణ పట్టాలపై వెళ్లలేవా? ప్రత్యేక ట్రాక్లు ఎందుకు నిర్మిస్తారు?