Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి పాల్వంచ వైపు విద్యార్థులతో వెళ్తున్న కేఎల్ఆర్ (KLR) ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అటవీ మార్గంలోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, వాహనదారులు మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సు అద్దాలు పగులగొట్టి లోపల ఇరుక్కుపోయిన విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతినడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
క్షతగాత్రులైన విద్యార్థులను అంబులెన్స్లలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద బాధితుల ఆర్తనాదాలతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. వైద్యులు అత్యవసర విభాగంలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Also Read: బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. ఆక్రమణల వ్యవహారంలో కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ఫిట్నెస్ సమస్యల వల్ల ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కళాశాల యాజమాన్యం నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో రోడ్లు ఇరుకుగా ఉండటం, మలుపుల వద్ద అప్రమత్తత లోపించడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం
మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడిన స్కూల్ బస్సు
బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసి ఆసుపత్రికి… pic.twitter.com/FhJfgqeiVK
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026