Couple Murder: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని షాహ్దారా జిల్లాలో వెలుగుచూసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? అన్న డీటేల్స్లోకి వెళ్లొద్దాం.
తూర్పు ఢిల్లీలో దారుణం.. దంపతుల హత్య
తూర్పు ఢిల్లీలోని షాహ్దారా జిల్లాలో రామ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు దంపతులు. వీరేందర్ కుమార్ బన్సల్ వయస్సు 75 ఏళ్లు కాగా, ఆయన భార్య పర్వేష్ బన్సల్, వయస్సు 65 ఏళ్లు. వీరేందర్ కుమార్ బన్సల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. వారంతా దూరంగా ఉంటున్నారు.
వీరేందర్ కొడుకు వైభవ్ ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా వైభవ్.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పేరెంట్స్ దగ్గరకు వచ్చాడు. అప్పటికి తల్లిదండ్రులు స్పృహ లేకుండా పడి ఉన్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
దోపిడీ గ్యాంగ్ పనేనని పోలీసుల అనుమానం
ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దంపతుల మృతదేహాలు మూడో అంతస్తులోని వేర్వేరు గదుల్లో పడేశారు. అయితే వీరేందర్ ముఖంపై తీవ్రమైన గాయాలున్నాయి. దోపిడీ దొంగలు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంట్లో విలువైన వస్తువులు మాయం అయ్యాయి.
దోపిడీ కోణంలో హత్యలు జరిగి ఉండవచ్చని షాదరా డీసీపీ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం తొలుత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో ఇలాంటి ఘటన జరగడంతో ఇరుగుపొరుగువారిలో కలకలం రేపుతోంది.
ALSO READ: రైల్వేస్టేషన్లో ఎగిసిపడుతున్న మంటలు.. 400 వాహనాలు దగ్దం