Medak News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఆ తర్వాత గుడిలో వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. అదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని యువకుడిపై దాడి చేశారు. యువతిని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది.
మెదక్ జిల్లాలో దారుణం.. ప్రేమజంటపై దాడి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి సాయినాథ్ మేడ్చల్లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. సిద్దిపేట జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. మేజర్లు కావడంతో ఇటీవల వీరిద్దరు దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి బెదిరింపు మొదలయ్యాయి.
పరిస్థితి గమనించిన సాయినాథ్, తమకు రక్షణ కావాలని మంగళవారం మనోహరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. మేడ్చల్లో వారిని వదిలేందుకు పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలియగానే యువతి తరఫు బంధువులు వారిని జాతీయ రహదారి NH 44 పై అడ్డుకున్నారు. పోలీసుల ఎదుట యువకుడిపై దాడి చేశారు.
పోలీసుల ఎదుట అబ్బాయిపై దాడి, అమ్మాయిని తీసుకెళ్లిన ఫ్యామిలీ సభ్యులు
యువతిని తమతో తీసుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ సంఘటనలో పోలీసుల ముందు జంటపై దాడి చేసినందుకు ఒక కేసు, అబ్బాయిపై దాడి చేసినందుకు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో విచారణ చేసి, నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
ఆ తరహా ఘటన మరొకటి జరిగింది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడ్ని కిడ్నాప్ చేసి అమ్మాయి బంధువులు అడవిలోకి తీసుకెళ్లి చితకబాదిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. లక్ష్మాతండాకు చెందిన దేవిసింగ్.. రెండేళ్లుగా సంగారెడ్డి జిల్లాలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
ALSO READ: సింగ్భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య
ఈ విషయం తెలుసుకున్న యువతి కజిన్ బ్రదర్స్ ఆమెతో దేవిసింగ్కు ఫోన్ చేయించారు. నర్సాపూర్ బస్టాండ్కు రమ్మని సమాచారం ఇచ్చారు. యువతితో దేవిసింగ్ మాట్లాడుతుండగా.. బలవంతంగా కారులో ఎక్కించుకుని నర్సాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు యువతి కజిన్ బ్రదర్స్. అక్కడ అతడ్ని చితకబాదారు.
వారి దెబ్బలు యువకుడు స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని భావించి అక్కడే వాడ్ని వదిలేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత స్పృహ రావడంతో గాయాలతో ఆటోలో హైదరాబాద్ శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.