పశ్చిమ సింగ్భూం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో గత కొన్ని గంటలుగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ తాజా పోరులో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 15కు చేరినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి జార్ఖండ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అందిన సమాచారం ప్రకారం.. సింగ్భూం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల కదలికలపై నిఘా వర్గాలకు ముందస్తు సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా కమాండోలు, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్, మోస్ట్ వాంటెడ్ నాయకుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ దా మరణించినట్లు తెలుస్తోంది. పతిరామ్ మాంఝీ తలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సుమారు 5 కోట్ల రూపాయల భారీ రివార్డును ప్రకటించాయి. దశాబ్దాలుగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ.. అనేక కీలక దాడుల్లో ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
ప్రస్తుతం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తి వివరాలను ఉన్నతాధికారులు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ: Sydney Violent Attack: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు