Mule Accounts: కమీషన్ కు కక్కుర్తి పడి సైబర్ క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సప్లయ్ చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం, ఎస్వోటీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి లక్ష రూపాయల నగదు, 3 మొబైల్ ఫోన్లు, 12 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు, 3 బ్యాంక్ పాస్ బుక్కులు, 7 చెక్ బుక్కులు, వేర్వేరు రాష్ట్రలకు కొరియర్ చేసిన 33 బ్యాంక్ పాస్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. ఆయన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దిలీప్ సింగ్ (27) కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి జీడిమెట్ల అపురూప కాలనీలో స్థిరపడ్డాడు. రాపిడో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం అతనికి ఇన్ స్టాగ్రామ్ ద్వారా జోర్డాన్, పింటూ భయ్యా అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది.
తమకు సేవింగ్స్ అకౌంట్లు సమకూరిస్తే ఒక్కోదానికి రూ.25 వేలు, కరెంట్ అకౌంట్ కు రూ. 50 వేల చొప్పున కమీషన్ గా ఇస్తామని వారు దిలీప్ కు చెప్పారు. ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, గేమింగ్, పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్స్ వంటి సైబర్ నేరాలకు అకౌంట్లు ఉపయోగిస్తారని తెలిసినా సులభంగా డబ్బు సంపాదించాలని దిలీప్ సింగ్ దీనికి అంగీకరించాడు.
ఆ తర్వాత తన అకౌంట్ తో పాటు మరికొందరి ఖాతాల వివరాలను దిలీప్ సింగ్ సేకరించాడు. ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, పాస్ బుక్కులు, చెక్ బుక్కులు, ఇతర బ్యాంకింగ్ పత్రాలను సైబర్ క్రిమినల్స్ కు పంపించాడు. ఓ కేసు విచారణలో దిలీప్ సింగ్ వ్యవహారం వెలుగు చూడటంతో పోలీసులు గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు.
Also Read: చిన్న గదుల కోసం.. అద్భుతమైన నిటారు కూలర్లు.. మధ్యతరగతికి వరం భయ్యా!
కాగా, దర్యాప్తులో నిందితునికి కొందరు బ్యాంక్ ఉద్యోగులు సహకరించినట్టు వెల్లడైంది. వాళ్లు ఎవరన్నది గుర్తించే దిశగా విచారణ చేస్తున్నట్టు డీసీపీ సాయి మనోహర్ చెప్పారు. డబ్బుకు ఆశపడి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ అకౌంట్లు అద్దెకు ఇవ్వటం, అమ్మటం చెయ్యవద్దని ప్రజలకు సూచించారు. బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే.. మీ జీవితాన్ని అమ్ముకున్నట్లేనని హెచ్చరించారు. ఏటీఎం కార్డులు, చెక్బుక్స్, సిమ్ కార్డులు, ఓటీపీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, కేవైసీ సమాచారాన్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో పంచుకోవద్దని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
Also Read: ఫ్రిడ్జ్ తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్తో.. చెక్ పెట్టండి!