Switzerland Bus Fire: స్విట్జర్లాండ్లోని కెర్జర్స్ (Kerzers) ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సుమారు 6:25 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ‘పోస్ట్బస్’ (PostBus) అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టే లోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఫ్రిబోర్గ్ కాంటోన్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిని బహుశా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బస్సు లోపల ఏదో అసాధారణమైన సంఘటన జరగడం వల్లే ఇంత వేగంగా మంటలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసును స్వీకరించి లోతైన విచారణ ప్రారంభించారు.
స్విట్జర్లాండ్లో గత మూడు నెలల కాలంలో చోటుచేసుకున్న రెండో పెద్ద అగ్ని ప్రమాదం ఇది. ఈ ఏడాది జనవరి 1వ తేదీన క్రాన్స్ మోంటానా స్కీ రిసార్ట్ లోని ఒక బార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భారీ విషాదం నుండి కోలుకోకముందే, ఇప్పుడు కెర్జర్స్లో ఆరుగురు బలికావడం స్విస్ ప్రజలను కలచివేస్తోంది.
ఈ దారుణ ఘటనపై స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫోరెన్సిక్ బృందాలు ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నాయి.
Also Read: విషాదం.. రెండు రోజులు ఆగమన్నందుకు ప్రాణాలు తీసుకున్నాడు!
స్విట్జర్లాండ్లోని కెర్జర్స్లో ఘోర అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదానికి గురైన ప్రయాణికుల బస్సు
మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనం
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
సమాచారం అందుకొని సహాయక చర్యలు చేపట్టేలోపే పూర్తిగా కాలి బూడిదైన బస్
దుర్ఘటనపై విచారణ… pic.twitter.com/K8eOHul3UG
— BIG TV Breaking News (@bigtvtelugu) March 11, 2026