Mahabubabad Suicide: మహబూబాబాద్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన శశికుమార్ (21) పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కేసముద్రం మండలానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినితో గత ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 11వ తేదీన పెళ్లి చేసుకోవాలని శశికుమార్ తన ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, తనకు ఈ నెల 13న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగుస్తాయని, పరీక్షలు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆ యువతి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కేవలం రెండు రోజులు ఓపిక పట్టాలని ఆమె కోరినప్పటికీ, శశికుమార్ పట్టుదలకు పోవడంతో ఇరువురి మధ్య ఫోన్లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తన మాట నెగ్గలేదన్న మనస్తాపంతో ఆవేశానికి లోనైన శశికుమార్ బుధవారం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. చేతికందిన కొడుకు ఇలా చిన్న కారణంతో తనువు చాలించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలం కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు శశికుమార్ (21)
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఘటన
A young man, Shashikumar (21), committed suicide after his love failed. The incident took place in Kuravi Mandal center, Mahabubabad district. pic.twitter.com/LkcCqwLRFH
— BIG TV Breaking News (@bigtvtelugu) March 11, 2026