Delhi Crime: రాజస్థాన్ లోని అల్వార్ నుంచి దేశ రాజధాని దిల్లీ వరకూ వరుస నేరాలకు పాల్పడిన 23 ఏళ్ల రాహుల్ మీనా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే అతడు రెండు అత్యాచారాలు, ఒక హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత నిందితుడ్ని పట్టుకునేందుకు దిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఓ హోటల్ గదిలో తలదాచుకున్న నిందితుడ్ని పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం అతడ్ని విచారించగా.. ఈ షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
దిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్ ప్రాంతంలో నివసిస్తున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై నిందితుడు రాహుల్ అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా మెుబైల్ ఛార్జర్ కేబుల్ తో గొంతు నులుమి ప్రాణాలు తీశాడు. ఐఆర్ఎస్ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. నిందితుడు నెల రోజుల క్రితం వరకూ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోనే పనిచేశాడని తేలింది. తోటి పనివాళ్ల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో అతడ్ని పనిలో నుంచి తీసేసినట్లు ఐఆర్ఎస్ అధికారి పోలీసులకు తెలియజేశాడు.
మరోవైపు పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు 15 బృందాలతో దిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక హోటల్ లో నిందితుడు తలదాచుకున్నట్లు గుర్తించారు. సదరు హోటల్ పై రైడ్ చేసి.. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మరికొన్ని షాకింగ్ విషయాలు పోలీసులకు తెలిశాయి.
ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచారానికి ముందు మరో మహిళపై సైతం నిందితుడు లైంగిక దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన బాధితురాలిపై దాడి చేసి.. చంపేందుకు సైతం యత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. రాహుల్ ఫ్యామిలీ గతంలో బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉండేవారు. అలా ఆమెతో నిందితుడికి పరిచయం ఏర్పడింది. రాహుల్ తన భర్తతో తరుచూ లూడో గేమ్ ఆడేవాడని బాధితురాలు సైతం తెలిపారు.
Also Read: Tirupati Tragedy: తిరుపతిలో తీవ్ర విషాదం.. ఒకే ఫ్యామిలీలో 5గురు మృతి.. అసలేం జరిగింది?
మరోవైపు దిల్లీలో జరిగిన హత్యకు గల కారణాలపై పోలీసు జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అల్వార్ లో మరో మహిళపై నిందితుడు చేసిన దారుణాన్ని ఆయన ధ్రువీకరించారు. తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న ప్రతీకారంతోనే ఐఆర్ఎస్ అధికారి కుమార్తెను హత్యాచారం చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో వరుసగా అఘాయిత్యాలు చేసినందున అతడి నేర ప్రవృత్తి గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలియజేశారు.
Also Read: నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!