Tirupati Tragedy: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రెండు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు విడిచారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉండటం విషాదాన్ని మరింత పెంచుతోంది. అయితే తొలుత ఫ్యామిలీలోని అత్తా కోడళ్లు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా.. ఆ తర్వాత అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి సైతం తన ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు విడవటం సంచలనంగా మారింది.
తిరుపతి జిల్లా నారయణవనం మండలం వెంటకట కృష్ణ పాలెంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మోహన్, హరిత భార్య భర్తలు. తల్లి చంద్రకళ, పిల్లలు కౌశిక్, హరిణితో కలిసి స్థానికంగా నివాసముంటున్నారు. మోహన్.. నారాయణవనంలో సిమెంటు షాపును నడుపుతుండగా, హరిత టైలరింగ్ చేస్తూ భర్తకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. హరిత సోదరుడు బాలకృష్ణ సైతం గత కొద్దిరోజులుగా బావ సిమెంటు షాపులో పనిచేస్తూ చేదోడుగా నిలుస్తున్నాడు.
ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు.. రైలు పట్టాలపై మూడు శవాలు
తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో తీవ్ర విషాదం
అంతుచిక్కని ఆత్మహత్యల మిస్టరీ
మిస్టరీగా మారిన మోహన్ కుటుంబం మరణాలు
ఇంట్లోని వేర్వేరు గదుల్లో విగతజీవులుగా తల్లి చంద్రకళ, భార్య హరిత
వేపగుంట వద్ద రైలు పట్టాలపై మోహన్… pic.twitter.com/kRNy1DW1d7
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026
బుధవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం సమయంలో భోజనం కోసం ఇంటికి వెళ్లిన మోహన్.. తిరిగి సిమెంటు షాపుకు రాలేదు. దీంతో బావమరిది హరికృష్ణ అతడికి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. కొద్దిసేపటి వరకూ ఎదురుచూసినా.. మోహన్ తిరిగిరాకపోవడంతో నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు తెరిచిచూడగా ఒక్కసారిగా బాలకృష్ణ అవాకయ్యాడు. తన సోదరి హరితతో పాటు ఆమె అత్త చంద్రకళ విగతజీవులుగా పడి కనిపించాడు. మరోవైపు మోహన్ మాత్రం ఇంట్లో ఎక్కడా కనిపించలేదు.
అత్తకోడళ్ల అనుమానస్పద మృతి ఘటన క్షణాల వ్యవధిలో స్థానికంగా కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హరికృష్ణ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. మోహన్ తన తల్లి, భార్యను హత్య చేసి పిల్లలతో పరారయ్యాడని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో అతడికి కోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు. మోహన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పుత్తూరు, కార్వేటినగరం, నగరి తదితర ప్రాంతాల్లో మోహన్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!
మోహన్ కోసం వెతుకుతున్న పోలీసులకు ఈ క్రమంలోనే షాకింగ్ సమాచారం అందింది. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పిల్లలతో కలిసి మోహన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. పుత్తూరు పట్టణానికి సమీపంలో వారి మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందినది మోహన్, వారి పిల్లలే అని నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి మరణాలకు కారణం ఏమై ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: Brahmamudi Serial Today Episode April 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును హగ్ చేసుకున్న ఇందు