Vijayashanti Reddy Suicide : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డిప్రెషన్ కారణంగానే విజయశాంతి రెడ్డి (Vijayashanthi Reddy) పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. తాను లేని లోకంలో పిల్లలు ఉండకూడదనే కొడుకు, కూతురితో కలిసి ప్రాణాలు తీసుకున్నట్టుగా తేలింది. విజయశాంతి రెడ్డి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను విశ్లేషించిన తరువాత ఆమె ఆత్మహత్యకు ఎలాంటి కారణాలు కనిపించ లేదని, డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమైందని రైల్వే ఎస్పీ సందీప్ రావు చెప్పారు. బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతంలోని హరితవనం కాలనీ వాస్తవ్యురాలైన విజయ రెడ్డి, సురేందర్ ల వివాహం 2007లో జరిగింది. విశాల్ రెడ్డి, చేతన రెడ్డి వీరి సంతానం. ఇద్దరు పిల్లలు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.
ఇదిలా ఉండగా నాలుగేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం రావటంతో సురేందర్ ఆ దేశానికి వెళ్లిపోయాడు. కాగా, విజయ రెడ్డి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పని చేస్తోంది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారించారు. విజయశాంతి రెడ్డి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను కూడా ఓపెన్ చేసి డేటాను విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఒంటరితనాన్ని భరించలేకనే విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసున్నట్టుగా వెల్లడైందని రైల్వే ఎస్పీ సందీప్ రావు చెప్పారు.
Also Read:Big TV Malayalam: బిగ్ టీవీ మలయాళం ఛానెల్.. కొత్త లోగో ఆవిష్కరించిన ఛైర్మన్ విజయ్
విజయ రెడ్డి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవన్నారు. భర్త, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి గొడవలు లేవని తెలిసిందన్నారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన సురేందర్ ను ప్రశ్నించినపుడు కూడా తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పాడన్నారు. భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండటం…పిల్లలు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న నేపథ్యంలో ఒంటరి జీవితంతో ఆమె డిప్రెషన్ కు గురై ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతం విజయ రెడ్డి తన తల్లి పుష్పలతతో కలిసి ఉంటోందని తెలిపారు.ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత విజయ రెడ్డి పటాన్ చెరు ప్రాంతంలోని హాస్టల్ లో ఉంటున్న కూతురు చేతన రెడ్డి, ఘట్ కేసర్ హాస్టల్లో ఉంటున్న కొడుకు విశాల్ రెడ్డిని తన కారులోనే తీసుకొచ్చిందన్నారు.
అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చినట్టు విచారణలో తెలిసిందన్నారు. కారును పార్క్ చేసి కొద్దిసేపు రైల్వే స్టేషన్ లో కూర్చున్నారన్నారు. ఆ తరువాత రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్టు తెలిపారు. పిల్లలంటే విజయ రెడ్డికి అమితమైన ప్రేమ ఉందని దర్యాప్తులో వెల్లడైందన్నారు. పిల్లలకు కూడా తల్లి అంటే అపరిమిత ప్రేమ అని చెప్పారు. తాను లేని లోకంలో పిల్లలు ఏం బాధలు పడతారో అని భావించి చేతన రెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు. తన కారులో ఓ చిన్న కాగితంపై ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని విజయ రెడ్డి రాసి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: Wardhannapet Municipality: ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు!