Wardhannapet Municipality: వర్ధన్నపేట, స్వేచ్ఛ : చదువుకొని ఎదగాల్సిన బాల్యం, ఆటపాటలతో గడపాల్సిన వయస్సులో రాజకీయ రంగులు పులిమి, పార్టీల కండువాలు వేసి ప్రచారానికి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా… ఓటర్ల కాళ్లు మొక్కిస్తూ సింపతీ ఓట్ల కోసం వాడుకోవడం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపుతోంది. ఓట్ల కోసం ఎక్కడిదాకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్న కొంతమంది నేతల తీరుకు ఈ సంఘటనే నిదర్శనంగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వార్డులో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నేత, తన అభ్యర్థి కుమారుడితో కలిసి ఓటర్ల కాళ్లు మొక్కించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లోనూ విస్మయాన్ని కలిగిస్తోంది.
Also Read: Hydra: చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం.. ఆక్రమణలు ఉపేక్షించేది లేదు : హైడ్రా కమిషనర్ స్పష్టం!
ఎన్నికల సమయంలో పిల్లలను ప్రచారంలో వినియోగించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్న విషయం తెలిసినా, అటువంటి ఆంక్షలను లెక్కచేయకుండా ఈ చర్యకు పాల్పడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. చిన్నారి చేత కాళ్లు మొక్కించి ఓట్ల కోసం వేడుకోవడం రాజకీయ సంస్కృతికి తీరని మచ్చగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు అనేది హక్కు… దాన్ని పొందేందుకు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ లాభాల కోసం బాల్యాన్ని బలి చేయొద్దని, రాజకీయ రంగులను పిల్లలపై రుద్దడం ద్వారా వారి మనసులను కలుషితం చేయవద్దని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ పిల్లలతో ప్రచారం చేయించడం, వారితో కాళ్లు మొక్కించడం వంటి ఘటనలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై పలువురు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని స్థానికులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఓటు కోసం నీతి, విలువలు, బాధ్యత అన్నింటినీ పక్కన పెట్టే రాజకీయ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!