School Bus Accident: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నాగారం ప్రాంతంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద చీర్యాలలోని డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు అదుపు తప్పి, ముందు వెళ్తున్న జీహెచ్ఎంసీ చెత్త లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ఇద్దరు విద్యార్థులను వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ రాజు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అతను తాగి డ్రైవింగ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ రాజు మద్యం సేవించి ఉన్నాడా అనే విషయాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: సంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి..
ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా డ్రైవర్ రాజు మద్యం తాగి డ్రైవింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని, అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, డ్రైవర్ నిర్లక్ష్యంపై, అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.