Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని ప్రముఖ విద్యాసంస్థ సర్ CR రెడ్డి ఫార్మసీ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కళాశాలలో బి.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షిని అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సువర్షిని కళాశాల క్యాంపస్లోని హాస్టల్లో ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. చాలించడం తోటి విద్యార్థులను, అధ్యాపకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిత్యం ఉత్సాహంగా ఉండే సువర్షిని నిన్న రాత్రి హాస్టల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో హాస్టల్ ఆవరణలో పెద్ద శబ్దం రావడంతో తోటి విద్యార్థులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన సువర్షినిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు శవమై కనిపించడంతో వారు తల్లడిల్లిపోతున్నారు.
అయితే, తన కుమార్తె మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి చిలుకూరి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు ముందు కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో సువర్షినికి, ఆమె స్నేహితులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం లేదా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మనస్తాపానికి గురైందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరపాలని ఆయన కోరారు. కేవలం చిన్నపాటి చర్చకే సువర్షిని అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాము భావించడం లేదని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు వివరాలను వెల్లడిస్తూ సీఐ కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో పారదర్శకత కోసం పోస్టుమార్టం ప్రక్రియను అత్యంత నిశితంగా నిర్వహిస్తామని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించే వైద్య బృందంలో తప్పనిసరిగా మహిళా వైద్యురాలు ఉండేలా చూస్తామని, అలాగే మొత్తం ప్రక్రియను వీడియో గ్రాఫి చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల మరణానికి గల అసలు కారణాలు శాస్త్రీయంగా వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో గంజాయి కలకలం.. 60 కేజీల గంజాయి స్వాధీనం
ప్రస్తుతం పోలీసులు కళాశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించి, సువర్షిని స్నేహితుల నుంచి, హాస్టల్ వార్డెన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పార్టీలో జరిగిన గొడవకు సంబంధించిన అంశాలను, ఆమె ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. నిజంగానే అది ఆత్మహత్యా లేక దీని వెనుక ఇతర ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, ఒక ఆశాకిరణంలా ఎదగాల్సిన విద్యార్థిని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం విషాదకరం.