Cannabis Seizure: విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పూరి నుండి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైలు విజయవాడ స్టేషన్కు చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న లగేజీ బ్యాగులను గుర్తించారు.
ఆ బ్యాగులను పరిశీలించగా.. వాటిలో సుమారు 60 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తిరుపతికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ గంజాయిని తరలించేందుకు వారు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తుల గురించి విచారణ వేగవంతం చేశారు. రైళ్లలో అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
Also Read: వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరి హయాంలో అభివృద్ధి? క్రెడిట్ ఎవరిది?