Fake Doctor: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన్య ప్రాంతంలో నకిలీ వైద్యుల ఆగడాలకు ఎనిమిదేళ్ల చిన్నారి సంగీత బలైపోయింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సంగీతను ఆమె తండ్రి వెంకటేష్ తొలుత దొరమామిడిగూడెం పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరమేనని నిర్ధారించి మందులిచ్చారు. అయితే, త్వరగా నయం అవుతుందన్న ఆశతో తండ్రి తన కుమార్తెను చినజీడిపూడికి చెందిన ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
మూడు రోజుల పాటు ఆర్ఎంపీ డాక్టర్ వద్దే చికిత్స అందించారు. ఈ క్రమంలో చిన్నారి ఆరోగ్యం మెరుగుపడాల్సింది పోయి ఒక్కసారిగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో కంగారుపడిన తండ్రి మళ్లీ ఆర్ఎంపీని సంప్రదించగా, తనవల్ల కాదని అతను చేతులెత్తేశాడు. దీంతో హుటాహుటిన జంగారెడ్డిగూడెం, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సంగీత ప్రాణాలు విడిచింది. మే 6న జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాలిక మృతిపై సమాచారం అందుకున్న ఐటీడీఏ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్వో సురేష్ కుమార్ ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. ఆర్ఎంపీ రమేష్కు ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేవని, అతను చిన్నారికి మోతాదుకు మించి మందులు ఇవ్వడం వల్లే ప్రాణాలు పోయాయని గుర్తించారు. అంతేకాకుండా, జీడిపూడిలో అనుమతులు లేకుండా ఏకే ల్యాబ్ నిర్వహిస్తున్న ఇర్ఫాన్ పఠాన్ వ్యవహారాన్ని కూడా అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
Also Read: 74 ఏళ్ల నాటి వివాదానికి ముగింపు.. ఆ 600 ఎకరాల భూమి అటవీశాఖదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!