Forest Land: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవల నగరం గ్రామంలోని సర్వే నెం.81లో ఉన్న సుమారు 600 ఎకరాల భూ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ భూమిని 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్లో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
నిజాం కాలంలో (1931–33 ఫస్లీ) తమకు పట్టు ఇచ్చిన భూమి అని పేర్కొంటూ కొంతమంది ఫారెస్ట్ పరిధి నుంచి మినహాయించాలని కోరారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ భూములకు సంబంధించిన పత్రాలు చూపడంలో విఫలమైనందున భూమి రికార్డుల్లో ‘అడవి’గా నమోదై ఉందని నాటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న వారి అభ్యర్థనను తిరస్కరించారు.
ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా, తొలుత సింగిల్ జడ్జి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే, డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేసి ప్రభుత్వ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. కేవలం ఫైసల్ పట్టి, వసూల్ బాకీ, పహాణీలు వంటి ఆదాయ రికార్డులు భూమిపై హక్కును నిర్ధారించవని, అవి గరిష్టంగా స్వాధీనంపై ఊహ మాత్రమే కలిగిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
ఆ భూమి ఎప్పటినుంచో ‘అడవి’గా నమోదై ఉందని కూడా పేర్కొంది. అలాగే, రిట్ పిటిషన్లోనే భూమిపై హక్కులను ప్రకటించడం న్యాయ పరంగా సాధ్యం కాదని పేర్కొంటూ, సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టింది. డివిజన్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ, నాటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో సివిల్ అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ 600 ఎకరాల భూమి ఆటవీశాఖదేనన్నారు.
Also Read: ఇంటి దగ్గరే డ్యూటీ.. దూరాభారానికి చెక్.. మున్సిపల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్