హరియాణా రాష్ట్రంలో మనసు కలిచివేసే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఏమీ తెలియని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను, కన్నతండ్రే లెక్కల పేరుతో బలి తీసుకున్నాడు. 50 వరకు అంకెలు చెప్పలేదన్న స్వల్ప కారణంతో ఆగ్రహానికి గురైన ఆ తండ్రి, చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఫరీదాబాద్లోని సెక్టార్-58లో జనవరి 21న చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల కృష్ణ జైస్వాల్, ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో, భార్య పగలు డ్యూటీకి వెళ్లేది, భర్త నైట్ షిఫ్ట్ చేసేవాడు. పగటిపూట ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునే కృష్ణ, వారికి చదువు చెప్పేవాడు. ఈ క్రమంలో బుధవారం తన నాలుగేళ్ల కుమార్తెను 50 వరకు అంకెలు లెక్కించమని అడిగాడు. ఆ చిన్నారి సరిగ్గా చెప్పలేకపోవడంతో విచక్షణ కోల్పోయిన అతను, చపాతీ కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
తన నేరాన్ని దాచేందుకు కృష్ణ, పాప మెట్లపై నుంచి పడిపోయిందని భార్యను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏడేళ్ల కుమారుడు తన తల్లికి అసలు నిజం చెప్పాడు. ‘నాన్న 50 వరకు లెక్కలు రాయమన్నారని, రాయలేదని చెల్లిని కొట్టారని’ బాలుడు వివరించాడు. దీంతో షాక్కు గురైన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు ప్రతినిధి యశ్పాల్ సింగ్ తెలిపారు.
మరో ఘటనలో.. హరియాణాలోని పిథోరాగఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా రాజేష్ రామ్ అనే వ్యక్తి తన భార్య నీలమ్ (30)ను కత్తితో పొడిచి హత్య చేశాడు. గొడవ ముదిరిన క్రమంలో రాజేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడం గమనార్హం. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.