ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో కొందరు వ్యక్తులు బరితెగించారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, అత్యంత అమానుషంగా దాడి చేయడమే కాకుండా.. అతనిపై మూత్రం పోసి పైశాచికానందాన్ని పొందారు. ఈ ఘటనలో సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంకుర్ రాజ్ తివారిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
భూ వివాదమే కారణం..
బాధితుడికి, ఎమ్మెల్యేకు మధ్య గత కొంతకాలంగా లక్నోలోని ఒక విలువైన భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఒక ప్రాపర్టీని తన పేరున రిజిష్టర్ చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో, బాధితుడు ఒక డిన్నర్ ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన దుండగులు అతడిని బలవంతంగా కిడ్నాప్ చేశారు.
వీడియో కాల్లో ఎమ్మెల్యే పర్యవేక్షణ?
కిడ్నాప్ చేసిన వ్యక్తిని గోరఖ్పూర్ సమీపంలోని సహ్జన్వా ప్రాంతానికి తరలించారు. అక్కడ ఎమ్మెల్యే సోదరుడు తన అనుచరులతో కలిసి బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడిని వివస్త్రను చేసి, అతనిపై మూత్రం పోసి అవమానించారు. ఈ దారుణం జరుగుతున్నంత సేపు ఎమ్మెల్యే అంకుర్ రాజ్ తివారి వీడియో కాల్ ద్వారా చూస్తూ పర్యవేక్షించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. సవాన్ తివారి అనే వ్యక్తి ఈ దారుణాన్ని మొబైల్లో వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దాదాపు ఎనిమిది మందిపై కొత్వాలి ఖలిలాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు మొదట వెనుకడుగు వేశారని ఆరోపిస్తూ బాధితుడి బంధువులు స్టేషన్ ముందు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ALSO READ: BCCI: తాను తీసుకున్న గోతిలో తానే పడింది…బంగ్లాదేశ్ తో ఆడే ఆ రెండు సిరీస్ లు రద్దు