Father kills Daughter: స్వేఛ్చ బ్యూరో: ప్రజల్లో నానాటికి అధికార వ్యామోహం పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివరికి కన్న కూతురినే హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులోని కెనాల్లో దొరికిక బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ సాయిచైతన్య వెల్లడించారు.
ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్ డీ 46 కెనాల్లో ఇటీవల ఓ బాలిక మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivas) ఆధ్వర్యంలో మూడు టీంలు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. బాలికను మహారాష్ట్రలోని ముఖేడ్కు చెందిన ప్రాచి కొండమంగలేగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను కన్న తండ్రే హతమార్చినట్లు గుర్తించారు. ముఖేడ్ తాలూకాలోని కెరుర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ భార్య ముగ్గురు పిల్లలతో ముఖేడ్లో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్ సర్పంచ్గా పోటీ చేయాలనే భావించాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉండడంతో పోటీకి అనర్హుడిని అవుతానని అనుకున్నాడు. దీంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్తో కలిసి పథకం వేశారు. ముగ్గురు పిల్లల్లో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు.
Also Read: Tata Motors Sales: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?
కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికెట్ ఉందని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పుణె కార్పొరేషన్ ఆఫీసు వెళ్లి బర్త్ సర్టిఫికెట్ మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికెట్ మారదని తెలిసిన తరువాత.. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచీని అతని తండ్రి తన బైక్పై ఎక్కించుకుని వచ్చి నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్ డీ 46 కెనాల్లో బాలికను తోసేశాడు. దీంతో చిన్నారి మృతి చెందింది. కేసును చాకచక్యంగా ఛేదించిన బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సైలు రమ, చంద్రమోహన్, ఏఎస్సై బాబురావు, కానిస్టేబుళ్లు సుధీర్, శ్రీకాంత్లను సీపీ అభినందించారు.