Bus Fire Incident: తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నర్సాపూర్ డిపోకు చెందిన ఈ బస్సు నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు ఒక్కసారిగా బస్ అంతటా వ్యాపించాయి.
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ హఠాత్ పరిణామానికి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, బస్సు డ్రైవర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, పరిస్థితులను గమనించి, తక్షణమే బస్సును రోడ్డు పక్కన సురక్షిత ప్రాంతంలో నిలిపివేసాడు..
డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడగలిగారు. వెంటనే ప్రయాణికులందరినీ దింపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులు బస్సు దిగి దూరం జరిగిన కొద్దిసేపటికే మంటలు మరింత తీవ్రమయ్యాయి. వెంటనే స్థానికులు, బస్సు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, బస్సు పూర్తిగా కాలిపోయి, తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: రాష్ట్రంలో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు బయటికొస్తే గండమే!
ప్రాథమిక విచారణలో, బస్సులోని సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. ఆర్టీసీ అధికారులు కూడా ఈ సంఘటనపై దృష్టి సారించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, బస్సుల ఫిట్నెస్, నిర్వహణను మరింత కఠినంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు.