Guntur Tragedy: ఏపీలో విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో బెలూన్ గొంతులో ఇరుక్కోని నాలుగేళ్లి చిన్నారి మృతి చెందింది. పెదకాకానికి చెందిన శిరీష (4) బెలూన్ ను ఊదుతూ ఆడుకుంటుండగా.. అది ఒక్కసారిగా గొంతులో అడ్డుపడింది. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చిన్నారిని గుంటూరు సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా ఆడుకున్న చిన్నారని.. ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పుట్టిన రోజులు, ఇతర వేడుకల్లో బెలూన్లు ఎక్కువగా వాడుతుంటారు. ఫంక్షన్ పూర్తైన తర్వాత ఆ బెలూన్లను పిల్లలు ఆనందంగా తీసుకెళ్తుంటారు. వాటితో ఆడుకుంటారు. అయితే ఈ బెలూన్లు చూడడానికి చిన్నవిగా ఉన్నా ప్రాణాలు తీస్తున్నాయని వైద్యులు అంటున్నారు. పిల్లలు బెలూన్లలోకి గాలి ఊదే ప్రయత్నంలో వాడిని నోట్లో పెట్టుకుంటున్నారు. ఒక్కోసారి గాలి బలంగా ఊదుతూ మింగేస్తున్నారు. బెలూన్లు గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు బెలూన్లతో ఆడుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పుట్టినరోజు పార్టీలకు రంగు రంగుల హీలియం బెలూన్లను పెడుతుంటారు. అవి చూడ్డానికి సరదాగా అనిపిస్తాయి. కానీ, ఒక్కోసారి సైలెంట్గా ప్రాణాలు తీసేంత డేంజరస్గా మారుతున్నాయి. హీలియం గ్యాస్కు రంగు, వాసన ఉండదు. అది విషపూరితం కాదు. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా బెలూన్లలో వాడుతుంటారు. కానీ హీలియం ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. బెలూన్ పిల్లల ముఖాన్ని పూర్తిగా కప్పేస్తే, ఆక్సిజన్కు బదులు హీలియం గ్యాస్ పీల్చుకునే ప్రమాదం ఉంది. సరిపడా ఆక్సిజన్ అందక పిల్లలు అపస్మారక స్థితికి వెళ్తారు. దీనికి ఎలాంటి వార్నింగ్ సైన్స్ కూడా ఉండవు. అంటే కేకలు వేయడం, కొట్టుకోవడం లాంటివేమీ కనిపించవు. అంతా నిశ్శబ్దంగా క్షణాల్లో జరిగిపోతుంది.
పిల్లల ఆటవస్తువుల్లోని చిన్న చిన్న అయస్కాంతాలు, బ్యాటరీలు, స్లైమ్ లాంటివి, రబ్బరు బెలూన్లను పొరపాటున మింగినా లేదా వాటివల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు వీటితో ఆడుకుంటున్నప్పుడు పెద్దలు జాగ్రత్తగా వారిని గమనించాలి.
Also Read: ఏపీలో దారుణం.. మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం