Gurugram horror: ఆడుతూ పాడుతూ చేసే డేటింగ్ యాప్ ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉన్నత చదువుల కోసం వచ్చిన 19 ఏళ్ల యువతి, తన ఉజ్వల భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో ఊహించని నరక యాతనను అనుభవించింది. కేవలం ఒక పరిచయం ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఫలితంగా మృత్యువుతో పోరాడే స్థితికి చేరింది.
ప్రేమ ముసుగులో కిరాతకం
గత సెప్టెంబర్లో శివం అనే యువకుడితో డేటింగ్ యాప్ ద్వారా త్రిపురకు చెందిన ఓ యువతికి పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో వీరిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. గురుగ్రామ్లోని సెక్టార్-69 ప్రాంతంలో ఓ ఫ్లాట్లో ఉంటున్నారు. యువతి తన భవిష్యత్తు గురించి ఆలోచించి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అదే ఆ యువతికి శాపంగా మారింది. ఫిబ్రవరి 16న సహ పార్టనర్తో చిన్న వివాదం తలెత్తింది. దీంతో శివంలోని పైశాచికత్వాన్ని బయటపడింది. యువతిని గదిలో బంధించి, బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేశాడు. ఆపై అమానుషంగా దాడికి దిగాడు.
వర్ణనాతీతమైన చిత్రహింసలు
కోపంతో ఊగిపోయిన శివం, ఆ యువతిపై అత్యంత క్రూరమైన పద్ధతుల్లో దాడి చేశాడు. స్టీల్ బాటిళ్లతో, మట్టి కుండలతో తలపై బలంగా కొట్టడమే కాకుండా, ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి నరకాన్ని చూపించాడు. అంతటితో ఆగక ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీశాడు. ఎవరికైనా చెబితే బయటపెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు. మూడు రోజుల పాటు ఆమెని నిరంతర చిత్రహింసలకు గురిచేశాడు. కనీసం చికిత్స అందించకుండా గదిలో ఉంచడం అతని వికృత చేష్టలకు నిదర్శనం.
భాష ద్వారా ప్రాణ రక్షణ
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధితురాలు, ఫిబ్రవరి 18 రాత్రి నిందితుడి కళ్లుగప్పి అతడి ఫోన్ నుండే తన తల్లికి కాల్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఉండేందుకు ఆమె తన మాతృభాష బెంగాలీలో తన పరిస్థితిని వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వచ్చి కాపాడాలంటూ చేసిన ఆర్తనాదం ఆ తల్లిని కలిచి వేసింది. అప్రమత్తమైన కన్నతల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు సకాలంలో స్పందించి బాధితురాలిని రక్షించగలిగారు.
Also Read: వివాహానికి కొన్ని గంటల ముందు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, కొత్త కోణం ఏంటి?
ప్రస్తుతం ఆ యువతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు శివంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సమాజంలో మహిళల భద్రత, డేటింగ్ యాప్ల వాడకంపై తీవ్ర చర్చకు దారితీసింది. మాయ మాటలతో నమ్మించి, ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి నేరగాళ్లకు కఠిన శిక్ష పడాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, పౌర సమాజం కోరుకుంటోంది.