Honour Killing: దేశంలో అమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదులు పెరిగి పోతున్నారు. అయినా సరే కొన్నిప్రాంతాల్లో కట్టుబాట్లు పేరుతో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న చెల్లిని దారుణంగా చంపేశారు ఆమె సోదరులు. చెల్లి, ఆమె భర్తని చంపేసి మృతదేహాలను ఫారెస్టులో విసిరేసిన ఘటన యూపీలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
కలకలం రేపుతున్న పరువు హత్య
యూపీలో కొత్త క్రైమ్స్ వెలుగులోకి వస్తున్నాయి. సోన్భద్రలో పరువు హత్య కలకలం రేపుతోంది. ఇంటి పరువు కోసం చెల్లి, ఆమె భర్తను నమ్మించి అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేశారు ఆమె సోదరులు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు.
బీహార్లోని పాట్నా జిల్లా నౌబత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీపూర్ గ్రామానికి చెందిన మున్నీ గుప్తా-అదే గ్రామానికి చెందిన దుఖాన్తో ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. చేసేదేమీ లేక కొద్దిరోజుల కిందట దుఖాన్.. మున్నీని గుజరాత్కు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అక్కడే నివాసం ఉంటున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవడమే
ఈ విషయం అమ్మాయి పేరెంట్స్కి తెలిసింది. కూతురిపై కుటుంబసభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. తమకు తెలీకుండా పారిపోయి సీక్రెట్గా పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు ఊరిలో అందరి ముందు తల ఎత్తుకోకుండా చేసింది రుసరుసలాడారు. మున్నీ ఉంటున్న ఇంటి జాడ తెలుసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.
ఇంటికి మీరు వస్తే ఊర్లో అందిరి ముందు ఘనంగా వివాహం చేస్తామని చెల్లిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు ఆమె సోదరులు. నిజమేనని నమ్మేసి గుజరాత్ నుంచి అన్నీ సర్దుకుని మున్నీ-ఆమె భర్త దుఖాన్ మీర్జాపూర్ వెళ్లారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చెల్లి మున్నీ-ఆమె భర్త దుఖాన్లను కారులో ఎక్కించి బీహార్ వైపు తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లకుండా సోన్భద్ర జిల్లా హతీనా ప్రాంతంలో కారుని ఆపేశారు.
ALSO READ: పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్కి వెళ్లిన టీచర్
ఈలోగా తమతో తెచ్చుకున్న కత్తితో మున్నీ-ఆమె భర్త దుఖాన్లను వారి గొంతు కోసి చంపేశారు. చెల్లి మృతదేహాన్ని అటవీ ప్రాతంలోకి విసిరేశారు. దుఖాన్ మృతదేహాన్ని మాత్రం దుద్ది పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో పడేశారు. ఆ తర్వాత నిందితులు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. సెప్టెంబర్ 24న హతీనాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒకటి, అక్టోబర్ 6న మరొక ప్రాంతంలో మృతదేహం చూసి షాకయ్యారు పోలీసులు.
కావాలనే ఎవరో హత్య చేసి ఉంటారని భావించారు. ఆ తర్వాత పొరుగునున్న బీహార్ పోలీసులను సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు మొదలుపెట్టారు. తమ సోదరుడు కనిపించలేదని దుఖాన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఈ పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. మున్నీ ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
వారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల విచారణలో నిందితులు నిజాన్ని అంగీకరించారు. అటవీ ప్రాంతం నుండి దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అలాగే నేరానికి ఉపయోగించిన పికప్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.