Suicide Attempt: స్వేఛ్చ బ్యూరో: కట్టుకున్న భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఓ వివాహిత న్యాయం కోసం రోడ్డెక్కిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే తమను బెదిరిస్తున్నారంటూ సదరు మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తీగారం గ్రామానికి చెందిన గండ్రకోట జంపయ్య, మహాలక్ష్మి దంపతుల కుమార్తె పావనికి, హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచెం అరవింద్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, గత కొంతకాలంగా భర్త అరవింద్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలోనే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు సమాచారం.
మంగళవారం ఉదయం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పావని, తన సమస్యను పరిష్కరించాలని పోలీసులను కోరింది. అక్కడ అధికారుల నుంచి సరైన స్పందన లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, వెంట తెచ్చుకున్న డీజిల్ను ఒంటిపై పోసుకుని జమ్మికుంట రహదారిపై ఆత్మాహుతికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అయితే, స్టేషన్లో తనకు న్యాయం చేస్తారని భావిస్తే, అందుకు భిన్నంగా పోలీసులు తన కుటుంబ సభ్యులపైనే ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పావని ఆరోపించింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై పడుకొని రాస్తారోకో నిర్వహించారు.
Also Read: Tollywood: లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. మరణానికి కారణాలు?
పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంటామని చెప్పి, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా తనను మోసం చేస్తున్నారని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. భర్త కాపురానికి తీసుకెళ్లే వరకు లేదా పోలీసుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకూర్చుంది. బాధితురాలి ఆందోళన సుమారు అరగంటకు పైగా కొనసాగడంతో వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బాధితురాలికి మద్దతుగా స్థానికులు కూడా చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు మరోసారి జోక్యం చేసుకుని బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించి, ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఉన్నతాధికారులు బాధితురాలితో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Ranveer Singh: రణవీర్ సింగ్ క్రెడిట్స్ వివాదం.. నిర్మాతలకు భారమవుతున్న ట్రెండ్..!