Vizag News: కారణాలు ఏమైనా కావచ్చు.. కూతురు వివాహం అనివార్య కారణాల వల్ల ఆగింది. జీవితంలో కూతురు హ్యాపీగా ఉంటుందని భావించాడు కన్నతండ్రి. ఆయన ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది.. తట్టుకోలేకపోయాడు. చివరకు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు తండ్రి. సంచలనం రేపిన ఈ ఘటన విశాఖలో వెలుగు చూసింది. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కుమార్తె పెళ్లి ఆగిందని తండ్రి ఆత్మహత్య
విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందినవాడు శ్రీనివాసరావు. ఆయన వయస్సు 54 ఏళ్లు. పిల్లల చదువు నిమిత్తం దాదాపు దశాబ్దం కిందట హైదరాబాద్కు మకాం మార్చాడు. చందానగర్లో శ్రీనివాసరావు ఫ్యామిలీ నివాసం ఉంటుంది. శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసరావుకు భార్య నాగమల్లేశ్వరితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది. కొడుకు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు ఉద్యోగం చేస్తుండడంతో వివాహం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఓ యువకునితో కూతురికి మ్యారేజ్ సెట్ అయ్యింది. ఈనెల 25న వివాహం జరగాల్సివుంది. అంతలో ఏం జరిగిందో తెలీదు.
విశాఖలో దారుణం, చిట్టా అంతా వాట్సాప్లో
రెండు కుటుంబాల మధ్య ఆర్థిక లావాదేవీలు తలెత్తాయి. చివరకు అబ్బాయి తరపువారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఉన్నట్లుండి అర్ధాంతరంగా కూతురు వివాహం ఆగిపోవడంతో తట్టుకోలేకపోయాడు శ్రీనివాసరావు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మూడు రోజుల కిందట విశాఖలోని పీఎం పాలెంలో తల్లిని చూసేందుకు వచ్చాడు.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుండి కారులో బయటికి వెళ్లాడు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 5.30 గంటలకు రోడ్డు పక్కన విగత జీవిగా ఉన్న శ్రీనివాసరావును చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ALSO READ: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ముగ్గురు మృతి
శ్రీనివాసరావు జేబులో మొబైల్ ఫోన్ లభించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గల కారణాలను కుటుంబానికి నాలుగు పేజీల వాట్పాస్ మెసేజ్ పంపాడు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలి? తనకు ఇవ్వాల్సిన వారి వివరాలు అందులో పేర్కొన్నాడు. కూతురు పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలను లేఖలో పేర్కొన్నాడు.
ఆస్తుల వివరాలు, వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆత్మహత్య దారితీసిన కారణాలు వాట్సాప్ మెసేజ్లో వివరించాడు. కుటుంబసభ్యులు వాట్సాప్ మెసేజ్ చూసి షాకయ్యారు.. కన్నీరు మున్నీరయ్యారు. విశాఖ కేజీహెచ్లో పోస్టుమార్టం తర్వాత శ్రీనివాసరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.