Hyderabad Crime: తల్లి వివాహేతర సంబంధం తెలుసుకున్న కుమారుడు.. ఆమె మృతి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న పొట్టోళ్ళ రజిని (40) తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి జీవిస్తుంది. గత కొంతకాలంగా జమీల్ (38) అనే వ్యక్తితో రజిని వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం ఆమె చిన్న కుమారుడు రాజ్ కిరణ్ (24)కు నచ్చకపోవడంతో జమీల్పై అతనికి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.
ఇటీవల రాజ్ కిరణ్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని జమీల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అతడిపై మరింత ద్వేషం పెంచుకున్నాడు. జమీల్ను ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో తన స్నేహితులు కృష్ణ, సోయబ్, సోయల్, మాలిక్ కు ఈ విషయాన్ని చెప్పాడు. ఈ నెల 15న జమీల్ను తన ఇంటికి పిలిచిన రాజ్ కిరణ్, స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అనంతరం జమీల్ ఇంటికి వెళ్తుండగా అతనిపై దాడికి దిగాడు. ఈ సమయంలో జమీల్ను కొట్టవద్దని.. తల్లి రజిని మధ్యలోకి రావడంతో గొడవ మరింత తీవ్రమైంది.
దీంతో కోపానికి లోనైన రాజ్ కిరణ్ కత్తిని జమీల్పై విసరగా.. అది రజిని కంటికి తలిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 17న రజిని మృతి చెందిందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనలో రజిని మృతికి కారణమైన రాజ్ కిరణ్, అతని స్నేహితుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: నా భార్యను చంపాను.. కానీ, హత్య చేయలేదు.. ఆస్ట్రేలియా కోర్టులో ఎన్ఆర్ఐ వింత వాదన