Australia Murder Case: నా భార్యను చంపాను.. హత్య చేయలేదంటూ ఓ ఎన్ఆర్ఐ కోర్టులో వింత వాదన వినిపించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వింత వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు. కానీ తాను హత్య కేసులో దోషి కాదని కోర్టులో వాదించాడు. వీడియో లింక్ ద్వారా అడిలైట్ మెజిస్ట్రేట్ ముందు హాజరైన విక్రాంత్ ఠాకూర్.. “నేను నా భార్యను చంపాను, కానీ హత్య కేసులో దోషిని కాదు” అని అన్నారు. తన లాయర్ జేమ్స్ మార్కస్ సూచనలతో విక్రాంత్ ఠాకూర్ ఈ విధంగా వాదించినట్లు తెలుస్తోంది.
గతేడాది చివర్లో సుప్రియా ఠాకూర్(36) హత్య కేసులో ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ అరెస్టు అయ్యాడు. చంపడం, హత్య రెండూ తీవ్రమైన నేరాలు అయినప్పటికీ, వీటి మధ్య వ్యత్యాసం ఉంది. హత్య అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరిని చంపడం. నరహత్య అనేది ఒక వ్యక్తి అనుకోకుండా మరొకరి మరణానికి కారణం అవ్వడం.
గతేడాది డిసెంబర్ 21న అడిలైడ్ నార్త్ఫీల్డ్లోని ఒక ఇంట్లో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న సమయానికి.. సుప్రియా ఠాకూర్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సీపీఆర్ చేసి ఆమెను బతికించడానికి అధికారులు ప్రయత్నించారు, కానీ ఆమెను బతికించలేకపోయారని తెలిపారు.
Also Read: అంతా చూస్తుండగా.. మెట్రో స్టేషన్లో మూత్రం పోసిన ప్రయాణికుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో మరొక వ్యక్తి ఉన్నారు. కానీ అతనికి గాయాలు కాలేదు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఠాకూర్ దంపతుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 22న విక్రాంత్ ను కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు తదుపరి విచారణను 16 వారాల పాటు వాయిదా వేసింది. ప్రాసిక్యూటర్లు DNA విశ్లేషణ, పోస్ట్మార్టం నివేదికతో సహా మరిన్ని ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారు.