Facebook Crypto Scam: హైదరాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకున్న భారీ సైబర్ మోసం కేసు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, కేవలం కొద్ది రోజుల పరిచయంలోనే ఓ డెంటల్ డాక్టర్ నుంచి ఏకంగా రూ.14 కోట్లను కాజేసిన సైబర్ నేరగాళ్ల ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. అత్యంత తెలివిగా పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడిన నిందితులు ఇంకా పరారీలో ఉండగా, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళ్తే… హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టర్కు ఇటీవల ఫేస్బుక్లో ‘మౌనిక’ అనే పేరుతో ఒక యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. సాధారణంగా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు కొనసాగించడం డాక్టర్కు అలవాటు కావడంతో.. ఆ రిక్వెస్ట్ను ఆయన అంగీకరించాడు. కొద్దిరోజుల చాటింగ్లోనే మౌనిక తనకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఓ మంచి మిత్రుడిగా తనకు సహాయం చేయాలని వేడుకుందట. దీంతో డాక్టర్ జాలిపడి ఆమె మాటలు నమ్మారు.
ఆ తర్వాత మౌనిక తెలివిగా తన అసలు ప్లాన్ను అమలు చేసింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో భారీగా లాభాలు వస్తాయని చెప్పి డాక్టర్ను ప్రలోభాలకు గురిచేసింది. మొదట చిన్న మొత్తంతో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయించింది. అందులో లాభాలు వచ్చినట్లు ఫేక్ డ్యాష్బోర్డులు, స్క్రీన్షాట్లు చూపించి డాక్టర్లో మరింత నమ్మకం కలిగించింది. తాను చెప్పిన సూచనలతో రోజురోజుకు లాభాలు పెరుగుతున్నాయన్న భ్రమను కల్పించింది.
ఆ నమ్మకంతో డాక్టర్ దశలవారీగా కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించాడు. కొన్నిసార్లు బ్యాంక్ ట్రాన్సఫర్ల ద్వారా, కొన్నిసార్లు ఆన్లైన్ వాలెట్ల ద్వారా డబ్బులు పంపించాడు. అయితే ట్రేడింగ్ అకౌంట్లో మాత్రం లాభాలు భారీగా పెరుగుతున్నట్లు మాత్రమే చూపిస్తూ అసలు డబ్బు మాత్రం నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోయింది.
కొన్ని రోజులు గడిచాక డాక్టర్కు తన లాభాలను విత్డ్రా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని మౌనికకు చెప్పగానే, డబ్బులు తీసుకోవాలంటే ముందుగా భారీ ట్యాక్స్ చెల్లించాలి, అది ప్రభుత్వ నిబంధన అంటూ మరో కొత్త నాటకం మొదలు పెట్టింది. దీంతో నమ్మిన డాక్టర్ మరోసారి పెద్ద మొత్తంలో డబ్బు ట్యాక్స్ పేరుతో చెల్లించాడు. ఇలా దశలవారీగా డాక్టర్ నుంచి మొత్తం రూ.14 కోట్ల వరకు వసూలు చేశారు.
ఏ మాత్రం డబ్బు చేతికి రాకపోవడంతో డాక్టర్కు అనుమానం మొదలైంది. ట్రేడింగ్ డ్యాష్బోర్డ్ కూడా అకస్మాత్తుగా పనిచేయడం మానేయడంతో మౌనికను సంప్రదించగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఫేస్బుక్ అకౌంట్, మెసెంజర్ ఖాతా అన్నీ డిలీట్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి సైబర్ క్రైం విభాగానికి అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఇది ఒక అంతర్జాతీయ సైబర్ ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫాంలను సృష్టించి, డబ్బులు విదేశాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వాలెట్లు, ఐపీ అడ్రసులను ట్రేస్ చేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.
Also Read: ఒక్కొక్క ప్లాట్ కు రూ.80 లక్షలు.. ఐదేళ్లు గడిచిన.. వాసవి గ్రూప్ ముందు కస్టమర్ల ఆందోళన
ఈ ఘటనపై పోలీసులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల మాటలను నమ్మి డబ్బులు పంపించడం ప్రమాదకరమని, క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు చేసేముందు తప్పనిసరిగా అధికారికంగా నమోదైన సంస్థలేనా కాదా అన్నది నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లాభాలు గ్యారంటీ అనే మాటలు వినగానే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.