ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నాన్ ఏసీ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే ప్యాసింజర్లకు బెడ్ షీట్లు, దిండ్లు అందించనున్నట్లు తెలిపింది. వీటిని ఉపయోగించే ప్రయాణీకులకు కొంత ఛార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీ ప్రయాణీకులకు మాత్రమే బెడ్ రోల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు రైల్వే తీసుకున్న తాజాగా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో స్లీపర్ ప్రయాణీకులు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందంటే?
తొలుత ఈ విధానాన్ని దక్షిణ రైల్వే పరిధిలో అమలు చేయనున్నారు. జనవరి 1 నుంచి 10 ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒక బెడ్ షీట్, ఒక దిండు, ఒక దిండు కవర్ తీసుకుంటే రూ. రూ.50 ఛార్జ్ చేస్తారు. బెడ్ షీట్ ధర రూ.20 కాగా, దిండుతో కూడిన కవర్ ధర రూ.30గా రైల్వే నిర్ణయించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ముందుగా ఈ సర్వీసు చెన్నై-మెట్టుపాలయం నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై-మంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై ఎగ్మోర్-మన్నార్ గుడి ఎక్స్ ప్రెస్, చెన్నై ఎగ్మోర్-తిరుచెందూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై-పాలక్కాడ్ ఎక్స్ ప్రెస్ లో ప్రారంభించనున్నారు. చెన్నై ఎగ్మోర్-సెంగోట్టై సిలంబు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, తాంబరం-నాగర్ కోయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై-తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై-అల్లెప్పీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై ఎగ్మోర్-మంగళూరు ఎక్స్ ప్రెస్ లలోనూ ఈ సౌకర్యాన్ని అమలు చేయనున్నారు.
భారీగా ఆదాయాన్ని పొందే అవకాశం
2023-24లో న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ కింద ప్రారంభించబడిన ఈ పైలట్ ప్రాజెక్టుకు ప్రయాణీకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పథకం కింద, కాంట్రాక్టర్ బెడ్ రోల్స్ సేకరణ, మెకనైజ్డ్ వాషింగ్, ప్యాకింగ్, లోడింగ్, పంపిణీ, స్టోరేజ్ బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సర్వీసు మూడు సంవత్సరాలలో చెన్నై డివిజన్ కు రూ.28.27 లక్షల ఆదాయాన్ని ఆర్జించగలదని భావిస్తున్నారు.
Read Also: రైలు కోచ్ లకు బ్లూ, రెడ్, గ్రీన్, బ్రౌన్ కలర్స్.. ఒక్కో రంగు వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?
ఈ సర్వీసు పొందాలనుకునే ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలోనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో బెడ్ రోల్స్ కావాలా? వద్దా? అనే ఆప్షన్ ను కల్పిస్తారు. కావాల్సిన వాళ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. వారికి ప్రయాణ సమయంలో బెడ్ రోల్స్ , దిండు అందిస్తారు. ఈ సౌకర్యంతో ప్రయాణీకులకు, రైల్వేకు లాభం కలగనుంది. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో ఈ బెడ్ రోల్స్ స్కీమ్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: ఎయిర్ బస్ A320 విమానాల రీకాల్.. కారణం ఏంటంటే?