Double Bedroom Scam: నిరుపేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను అవకాశంగా చేసుకొని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసిన ముగ్గురిని హైదరాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 79 నకిలీ కేటాయింపు పత్రాలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ఈ కేసుకు షాకింగ్ విషయాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
డీసీపీ శ్రీధర్ ప్రకారం.. తిరుమలగిరి నివాసులైన తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత (54), తిమ్మిరి గోపీనాథ్ విశాల్ (21)లు తల్లీకొడుకులు. వీరికి తిరుమలగిరిలోనే రాధాస్వామి జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్ (45)తో పరిచయం ఉంది. ముగ్గురు కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. దాని ప్రకారం పుష్పలత జీహెచ్ఎంసీ అధికారిణిగా అవతారం ఎత్తింది. ఇక, విశాల్, మహేందర్ సింగ్ కలిసి తమకు జీహెచ్ఎంసీ అధికారిణితో పరిచయం ఉందని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని ప్రచారం చేశారు.
తమ వలలో చిక్కుకున్న వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశారు. అనంతరం వారికి నకిలీ కేటాయింపు పత్రాలను అందజేశారు. అయితే మూడేళ్లు గడిచినా ఒక్కరికి కూడా ఇల్లు దక్కలేదు. దాంతో గోగికర్ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వగా అల్వాల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ జరిపి పుష్పలత, విశాల్, మహేందర్ సింగ్ లను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న జయరాజ్ గంగాధరన్, నిషా రాజ్, చింటూ రాజ్, రాజ్ & కో రబ్బర్ స్టాంప్స్ యజమాని పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
Also Read: పాత ఏసీ రిపేరా? కొత్తది కొనాలా? ఈ ‘3’ విషయాలు మర్చిపోకండి!
నకిలీ కేటాయింపు పత్రాలను తయారు చేయడం, వాటిని బాధితులకు ఇవ్వటంలో పుష్పలత, విశాల్ కీలక పాత్ర పోషించారని డీసీపీ శ్రీధర్ చెప్పారు. మహేందర్ సింగ్ తన జిరాక్స్ సెంటర్లో ఈ నకిలీ కేటాయింపు పత్రాలను డిజైన్ చేసి ప్రింట్ చేశాడన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ లను డీసీపీ అభినందించారు.
Also Read: ఏసీలో ‘ఆటో మోడ్’ ఉందా? వర్షాకాలంలో కెవ్వు కేక.. అదృష్టమంటే మీదే!