AC Auto Mode: వేసవి కాలంతో పాటు తేమ అధికంగా ఉండే వర్షాకాలంలోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. గదిలోని ఉక్కపోతను తగ్గించుకునేందుకు పలువురు ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే ఒక చిన్న సెట్టింగ్ మార్చడం ద్వారా ఏసీ పవర్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఏసీ ‘ఆటో మోడ్’ ఆన్ చేయడం ద్వారా బెనిఫిట్స్ పొందొచ్చని సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా చాలా మంది ఏసీ ఆన్ చేయగానే రూమ్ త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీల టెంపరేచర్ పెడుతుంటారు. దీనివల్ల కంప్రెషర్ నిరంతరాయంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. అదే ఏసీని ‘ఆటో మోడ్’లో పెడితే గదిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా ఏసీ తనంతట తానుగా ఫ్యాన్ స్పీడ్ను, కంప్రెషర్ రన్నింగ్ను అడ్జస్ట్ చేసుకుంటుంది. గది కావాల్సినంత చల్లబడగానే కంప్రెషర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
వేసవిలో బయట వేడి ఉష్ణోగ్రత అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది ఏసీని ‘ఆటో మోడ్’లో కాకుండా ‘కూల్ మోడ్’లో తక్కువ టెంపరేచర్ లో పెడుతుంటారు. దీనివల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగి కరెంటు బిల్లు అధికంగా వచ్చే చాన్స్ ఉంది. అలా కాకుండా ఆటో మోడ్లో పెట్టి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సూచించినట్లు 24°C లేదా 25°C టెంపరేచర్ ఫిక్స్ చేస్తే.. కరెంట్ బిల్లు 20% వరకు తగ్గడంతో పాటు గది వాతావరణం అహ్లాదకరంగా ఉంటుంది.
వర్షాకాలంలో ఉష్ణోగ్రత పెద్దగా లేకపోయినా గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒళ్లంతా జిడ్డుగా, ఉక్కపోతగా అనిపిస్తుంది. ఈ సమయంలో ఏసీని ఆటో మోడ్లో ఉంచితే అది గదిలోని తేమను తొలగిస్తుంది. గది వాతావరణం చల్లబడగానే ఫ్యాన్ స్పీడ్ను తగ్గించి కరెంట్ వృథా కాకుండా చూస్తుంది.
Also Read: ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!
రాత్రి పూట నిద్రపోయేటప్పుడు 2 లేదా 3 గంటల తర్వాత ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా టైమర్ సెట్ చేసుకోవడం వల్ల పవర్ బిల్లును తగ్గించుకోవచ్చు. నెలకు కనీసం రెండు సార్లు ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేయడం వల్ల గాలి ఫ్లో బాగా పెరిగి.. కంప్రెషర్పై లోడ్ తగ్గుతుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు తక్కువ స్పీడ్లో సీలింగ్ ఫ్యాన్ వేయడం వల్ల చల్లటి గాలి గది అంతటా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఆటోమేటిగ్గా కంప్రెసర్ పై భారం తగ్గుతుంది.
Also Read: క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!