Murder Case: హైదరాబాద్లో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై, జనాలు చూస్తుండగానే.. రియల్టర్గా పనిచేస్తున్న రత్నం అనే వ్యక్తిపై దుండగులు అతి కిరాతకంగా చంపేశారు.
మల్కాజిగిరి జవహార్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘోర హత్య చోటుచేసుకుంది. సాకేత్ కాలనీలో ఫోస్టర్ స్కూల్ సమీపంలో బైక్ మీద వెళ్తున్న రియల్టర్ రత్నంను దుండగులు కత్తులతో వెంబడించారు. కత్తులతో అనేక సార్లు నరికి తుపాకీతో కాల్చి చంపి, అక్కడి నుండి దుండగులు పారిపోయారు.
దాడి జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రమైన గాయాలతో ఉన్న రత్నాన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ హత్య పక్కాగా ప్లాన్ చేసి చేసిందని, దుండగుల కదలికలన్నీ ముందే రికార్డ్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొన్ని స్పష్టమైన సన్నివేశాలు ఉన్నట్లు పోలీసులు సూచిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవి పుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
దాడికి ముందు వారు ఏ వాహనాల్లో వచ్చారు? ఎక్కడ దాగి ఉన్నారు? దాడి అనంతరం ఏ దిశగా పారిపోయారు? వంటి వివరాలను విశ్లేషిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న రత్నం కొన్ని రోజులుగా స్థానిక వివాదాల్లో కూడా మధ్యవర్తిత్వం చేసినట్లు సమాచారం. అతడికి కొందరి వ్యక్తులతో గతంలో విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నారు.