Hyderabad Crime: సుపారీ గ్యాంగుతో భార్యను హత్య చేయించి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగులోని ఓ సభ్యున్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. గండిగూడెం గ్రామానికి చెందిన మీనా దేవి (36), అనిల్ కుమార్ సాహూ భార్యాభర్తలు. ఈనెల 30న గండిగూడెం గ్రామ శివార్లలోని మీటర్ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో దుండగులు మీనా దేవిని కత్తితో గొంతు కోసం కిరాతకంగా హత్య చేశారు.
దీనిపై అనిల్ ఐడీఏ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజున కూరగాయలు కొనటానికి బైక్ పై సంతకు వెళ్లినట్టు పేర్కొన్నాడు. కూరగాయలు కొని ఇంటికి బయల్దేరినట్టు చెప్పాడు. రాత్రి 9గంటల సమయంలో మీటర్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే బైక్ ఇంజన్ ఆఫ్ అయినట్టు తెలిపాడు. తాను బైక్ ను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురు దుండగులు పొదల్లో నుంచి బయటకు వచ్చి తన భార్య మీనా దేవిపై దాడి చేసినట్టు చెప్పాడు. వాళ్ల చేతుల్లో కత్తులు ఉండటంతో భయపడి తాను బైక్ పై వంద మీటర్ల దూరం పారిపోయానని తెలియచేశాడు.
ఆ తరువాత ధైర్యం తెచ్చుకుని వెనక్కి వచ్చానన్నాడు. దుండగుల చేతుల్లో నుంచి భార్యను కాపాడుకోవాలని పొదల్లోకి వెళ్తుండగానే వాళ్లు కత్తితో గొంతు కోసం దారుణంగా హత్య చేసినట్టు పేర్కొన్నాడు. ఆ తరువాత తనపై కూడా దాడి చేశారని దీంతో గాయాలయ్యాయని తెలిపాడు. అయితే, మీనా దేవి సోదరుడు సోనూ లాల్ కుమార్ తన అక్క హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అనిల్ కుమార్ పై అనుమానాలు వ్యక్తం చేశాడు.
సోనూ లాల్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు అధికారులు విచారించారు. అడిగిన ప్రతీసారి అనిల్ కుమార్ భిన్నమైన సమాధానాలు చెప్పటంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో భార్యను తానే హత్య చేయించినట్లు భర్త అంగీకరించాడు. మూడేళ్లుగా తన సంపాదన మొత్తం మీనా దేవి పుట్టింటి వారి కోసం ఖర్చు చేస్తుండటం తనకు నచ్చలేదని అనిల్ కుమార్ వెల్లడించాడు.
Also Read: కీలక ఘట్టం ఆవిష్కృతం.. ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
దీంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని బీహార్ కు చెందిన సుపారీ గ్యాంగ్ లీడర్ రింకూ కుమార్ ను సంప్రదించినట్టు చెప్పాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకొని తన భార్య చంపే పనిని అప్పగించానన్నాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ తన సహచరులైన రంజన్, నీరజ్ లతో కలిసి హైదరాబాద్ వచ్చినట్టు చెప్పాడు. అనంతరం అందరం కలిసి చేసిన కుట్ర ప్రకారం మీనా దేవిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అలాగే బీహార్ రాష్ట్రం వెస్ట్ చంపారన్ ప్రాంతంలో రంజన్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రింకూ సింగ్, నీరజ్ ల కోసం గాలిస్తున్నట్టు డీసీపీ శ్రీనివాస రావు తెలిపారు.
Also Read: ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!