Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
మహారాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవి, పూజలకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు కొంతకాలం పాటు సజావుగానే జీవనం సాగించారు. అయితే.. గత కొంతకాలంగా పూజకు అమిత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు మొదలయ్యాయి. తన సంసారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రవి తన భార్యను, అలాగే అమిత్ను పలుమార్లు హెచ్చరించాడు. వారి ప్రవర్తన మార్చుకోవాలని కోరాడు.
రవి ఎన్నిసార్లు హెచ్చరించినా అమిత్, పూజలు తమ పద్ధతిని మార్చుకోలేదు. పైగా రవి మాటలను బేఖాతరు చేస్తూ తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో.. తన కళ్లముందే తన కుటుంబం నాశనమవుతోందన్న ఆగ్రహం.. ఆవేదన రవిలో పెరిగిపోయాయి. అమిత్, పూజలు కలిసి ఉన్న సమయంలో రవి తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అమిత్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి, పూజ కూడా గాయపడింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. తీవ్రంగా గాయపడిన అమిత్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో అమిత్ చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రవిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. క్లూస్ టీమ్ ద్వారా సాక్ష్యాలను సేకరించిన పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ALSO READ: Rangareddy District: కరెంట్ తీగలపై పతంగి.. తీసే ప్రయత్నంలో బాలుడికి గాయాలు, ఇల్లు దగ్ధం