Rangareddy District: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రశాంతినగర్లో గణేష్ అనే బాలుడు తన ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలనే పని మీద ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ గాలిలో ఎగురుతూ వచ్చిన ఒక పతంగి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయింది. ఆ పతంగిని తీయాలనే ఉద్దేశంతో బాలుడు ఒక కర్రను ఉపయోగించి దానిని లాగేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ, ఆ కర్ర ద్వారా హైటెన్షన్ విద్యుత్ బాలుడికి ప్రవహించడంతో అతను తీవ్రమైన విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన గణేష్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ ప్రమాదం కేవలం బాలుడికే పరిమితం కాలేదు.. విద్యుత్ షాక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే.. సమీపంలోని ఒక ఇంట్లో హై-వోల్టేజ్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని ఫ్యాన్లు ఊడి కింద పడిపోయాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
ALSO READ: Srikakulam Road Accident:అయ్యో పాపం.. బైక్ను తప్పించబోయి కారును ఢీకొట్టిన లారీ.. కుటుంబం బలి!