ORR Accidents: రాష్ట్ర రాజధానికి మణిహారం లాంటి జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు యమ డేంజర్ గా మారింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కైలాసంలోని పెద్ద పాములా మనుషుల ప్రాణాలను మింగేస్తోంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో నిర్మించిన ఈ రోడ్డుపై నెలకు సరాసరిన 18కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ నాలుగు రోజులకొకరు మృత్యువాత పడుతుండగా రెండు రోజులకొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. వీరిలో కొందరు శాశ్వత అంగవికలురుగా మిగిలి పోతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాహనదారుల నిర్లక్ష్యమే అని అధికారులు చెబుతున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపిస్తుండటం…నిబంధనలను ఏమాత్రం పాటించక పోతుండటం వల్లనే ఓఆర్ఆర్ పై తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
హెచ్చరికలు ఉన్నా పట్టించుకోని వైనం
రోడ్డుకు ఇరువైపులా.. స్పీడ్ థ్రిల్స్…బట్ ఇట్ కిల్స్ అని రాసి ఉన్న సైన్ బోర్డులు ఔటర్ రింగు రోడ్డుపై పలు చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అయితే, ముఖ్యంగా కార్లు నడుపుతున్న వారు ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇరువైపులా నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది లైన్లతో ఓఆర్ఆర్ నిర్మించినపుడు దీనిపై గరిష్ట వేగం 80 కిలోమీటర్లుగా అధికారులు నిర్ణయించారు. అంతకు మించి వేగంతో వెళితే చర్యలు తీసుకునేవారు. వాహనాల వేగాన్ని గమనించటానికి అప్పట్లో ఓఆర్ఆర్ పై స్పీడ్ గన్లను కూడా ఏర్పాటు చేశారు.
మితిమీరిన వేగం
ఇక, ఒక్కో లైన్ లో ఎడమ వైపు ఉండే మొదటి రెండు లైన్లను భారీ వాహనాలు, గూడ్స్ లారీలకు కేటాయిస్తే కుడివైపు ఉండే లైన్ల మీదుగా కార్లు వెళ్లాలి. కాగా, కొంతకాలం క్రితం అధికారులు స్పీడ్ లిమిట్ నిబంధనను సడలించారు. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పలువురు వాహనదారులు ఓఆర్ఆర్ పై పట్టపగ్గాలు లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో రయ్యిన దూసుకెళుతున్నారు.
జిగ్ జాగ్ డ్రైవింగ్ తో ప్రాణాల మీదకు..
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా గాలితో పోటీ పడుతున్నట్టు వెళుతున్న వారు జిగ్ జాగ్ గా వాహనాలు నడుపుతుండటం. నిబంధనల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని కుడివైపు నుంచి మాత్రమే ఓవర్ టేక్ చేయాలి. అది కూడా కుడివైపు ఉన్న ఇండికేటర్ ను ఆన్ చేసిన తరువాత. ఓఆర్ఆర్ పై వాహనాలు నడుపుతున్న వారిలో చాలామంది దీనిని పాటించటం లేదు. ఎటువైపు ఖాళీ కనిపిస్తే అటువైపు నుంచి ముందుకు దూసుకెళుతున్నారు. ఇండికేటర్లు కూడా వేయకుండా సడన్ గా లైన్లు మారుస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు అవతలివారిని మృత్యుముఖంలోకి నెడుతున్నారు.
నియమాలను విస్మరిస్తున్న లారీ డ్రైవర్లు
ఇక, వాహనాలు రిపేరుకు వచ్చినా, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా ఓఆర్ఆర్ పై దీని కోసం సౌకర్యాలు ఉన్నాయి. నిర్ణీత దూరానికి ఒకటి చొప్పున బ్రేక్ డౌన్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ల వద్ద లారీలు మొదలుకుని కార్ల వరకు ఎవరైనా తమ తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ఇక, ఈ బ్రేక్ డౌన్ పాయింట్ల వద్ద కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా వసతులు కల్పించారు. అయితే, చాలామంది లారీ డ్రైవర్లు తమ తమ లారీలను ఓఆర్ఆర్ పై ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు ఎడమ వైపు పార్క్ చేస్తున్నారు. ఇలా పార్క్ చేస్తున్న వాహనాలను వెనక నుంచి వచ్చి ఢీకొడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
ఏ కారైనా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటేనే డ్రైవర్ ఆధీనంలో ఉంటుందని ఈ ఫీల్డ్ లో ఉన్నవారు చెబుతున్నారు. అంతకు మించి వేగంతో నడిపితే వాహనం కంట్రోల్ లో ఉండదన్నారు. దీనికి కారణం పవర్ స్టీరింగులే అని చెప్పారు. ఓవర్ స్పీడ్ లో స్టీరింగ్ ను అర అంగుళం పక్కకు తిప్పినా…దానిపై అరసెకనుపాటు అదుపు కోల్పోయినా ఏటో ఒక వైపు దూసుకెళ్లి పోతుందని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని చెప్పారు. పోలీసు అధికారులతో మాట్లాడితే వాహనదారులు వాహనదారులకు స్వీయ నియంత్రణ అవసరమన్నారు. పరిమితికి మించిన వేగంతో అస్సలు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అప్పుడే కొంతలో కొంత ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.
Also Read: ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో గంజాయి గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!