Hyderabad: డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మాదక ద్రవ్యాల విక్రయాలపై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. చందానగర్, నార్సింగి, కొల్లూరు పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రా. హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నార్సింగిలోని మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ సమీపంలో హెరాయిన్ విక్రయిస్తుండగా ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని నార్సింగి పోలీసులు హెచ్చరించారు. యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో ఈ ముగ్గురు నిందితులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 15 గ్రా ఎండీఎంఏ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠా బెంగళూరు నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Bus Accident: ఆగని బస్సు ప్రమాదాలు.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. 8 మంది స్పాట్ డెడ్
న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈవెంట్లను లక్ష్యంగా పెట్టుకుని పెడ్లర్లు భారీగా డ్రగ్స్ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ముగ్గురు సభ్యుల గ్యాంగ్ ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో 42 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.