Hyderabad Police: హైదరాబాద్ లో పాత నేరస్తున్ని అరెస్ట్ చేసిన అమీన్ పూర్ పోలీసులు.. అతడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడు దొంగిలించిన 45 తులాల బంగారు నగలను కోర్టు అనుమతితో బాధితులకు అందచేశారు. ఇన్నాళ్లు తమ బంగారం తరిగి వస్తుందో లేదో తెలియక తీవ్ర సతమతమైన బాధితులు.. తాజా పరిణామంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామ్ నాయక్ తండాకు చెందిన మండల్లా శివ అలియాస్ ఎర్ర శివ (32) 18 ఏళ్ల క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. భూపేశ్ గుప్తా కాలనీలో భార్యా ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ కొంత కాలం కూలీగా పని చేశాడు. అయితే కూలీ పనిలో ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో తేలికగా డబ్బు సంపాదించటానికి దొంగతనాలు మొదలు పెట్టాడు.
సైబరాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై 24 కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లినా శివ తన ప్రవృత్తిని మార్చుకోలేదు. నెలరోజుల క్రితం అమీన్ పూర్, బందం కొమ్ము ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలోకి చొరబడి వజ్రాలు పొదిగిన బంగారు నగలను చోరీ చేసి ఉడాయించాడు.
Also Read: చంద్రబాబు మోసాలపై పుస్తకాలే రాయొచ్చు.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ నరేశ్, క్రైం ఇన్స్ పెక్టర్ సత్యనారాయణతోపాటు సిబ్బందితో కలిసి విచారణ జరిపి శివను అరెస్ట్ చేశారు. అతని నుంచి 45 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకుని ఈ ఆభరణాలను శనివారం రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా సొంతదారులకు అప్పగించారు.
Also Read: ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం