Bus Accident: హైదరాబాద్ నగరం మలక్పేట్ పరిధిలోని అఫ్జల్నగర్లో గురువారం సాయంత్రం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు తమ కుమార్తెను చూసేందుకు నగరంలోని కొత్తపేటకు వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా ట్యాంక్ బండ్ వెళ్దామని ప్లాన్ చేసుకుని, రెండు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. ముందు భాగంలో కుమార్తె, అల్లుడు, మనవరాలు ఒక బైక్పై వెళ్తుండగా, వారి వెనుకే తిరుపతిరావు దంపతులు స్కూటీపై ప్రయాణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా సాగిన ఆ ప్రయాణం, అఫ్జల్నగర్ చేరుకోగానే మృత్యుపాశంగా మారింది.
కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడం అక్కడి వారిని కలిచివేసింది. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి వీరి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు దంపతులు ఇద్దరూ బస్సు టైర్ల కింద పడిపోయారు. బస్సు చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో వెంకటమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలైన తిరుపతిరావు కొద్ది నిమిషాల వ్యవధిలోనే కన్నుమూశారు. కళ్లముందే తల్లిదండ్రులు రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం చూసి కుమార్తె, అల్లుడు షాక్కు గురయ్యారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఒక మెకానిక్ షాపు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో ఆర్టీసీ బస్సు స్కూటీని ఓవర్టేక్ చేసే క్రమంలో అతి సమీపంగా వెళ్లడం, నియంత్రణ కోల్పోయి ఢీకొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డుపై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడమే ఈ అనర్థానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ప్రమాదం జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు.
Also Read: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..
సంఘటనా స్థలానికి చేరుకున్న మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట కుటుంబంతో గడపాలని వచ్చిన ఆ దంపతులు, ఇలా రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారడం ఈ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.