Hyderabad Shocker: ఈర్ష్య ఎంతటి దారుణాన్ని అయిన చేయిస్తుంది అంటారు. ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన కొడుకుకన్నా తోటి కోడలి బిడ్డను ఎక్కువగా గారాబం చేయడాన్ని ఓ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. నాలుగేళ్ల బాలునితో యాసిడ్ తాగించి హత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
4 ఏళ్ల బిడ్డ చేత ఓ చిన్నమ్మ యాసిడ్ తాగించిన ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ లోని శ్రీనివాస కాలనీకి చెందిన సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు పెళ్లైన నాగరాజు, జగదీశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, అతడి భార్య సంధ్యకు కార్తిక్ (4) అనే బాబు ఉన్నాడు. ఆ ఇంట్లోనే రెండో కుమారుడు జగదీశ్, అతడి భార్య మంజుల సైతం ఉంటున్నారు. వారికి కూడా ఓ కొడుకు ఉన్నాడు.
అయితే అత్తమామలు తన బిడ్డ కంటే కార్తీక్ ను బాగా చూసుకోవడాన్ని చిన్నకోడలు మంజుల తట్టుకోలేకపోయింది. దీంతో నాలుగేళ్ల బాలుడిపై కక్ష గట్టింది. ఈ క్రమంలో అతడ్ని పలుమార్లు చంపేందుకు సైతం యత్నించినట్లు తెలుస్తోంది. ఓసారి బెడ్ రూంలో కార్తీక్ ముక్కు, నోరు మూసి హత్య చేయాలని ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత మరోసారి టెర్రస్ పైకి తీసుకెళ్లి ప్రమాదకరంగా రెయలింగ్ పై కూర్చోబెట్టిందని పేర్కొంటున్నారు. అది చూసి మామ సతీశ్.. మంజులను మందిలించినట్లు తెలుస్తోంది.
Also Read: ఉస్మానియాలో దారుణం.. సీనియర్ల వికృత చేష్టలు.. వైద్య విద్యార్థి ఆత్మహత్య!
మామ మందలించినప్పటికీ మంజులలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా చాక్లెట్ ఇస్తానని కార్తిక్ ను వంటగదిలోకి తీసుకెళ్లి జ్యూస్ పేరుతో యాసిడ్ తాగించినట్లు సమాచారం. బాధతో కార్తీక్ పెట్టిన కేకలు విని.. తల్లి సంధ్య పరుగున అక్కడికి వచ్చింది. కొడుకు చెప్పిన విషయాన్ని విని నివ్వేరపోయింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి బిడ్డను తీసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.
Also Read: BSNL మరో సూపర్ ప్లాన్.. ఈసారి 84 రోజులు.. 252 GB డేటా, అపరిమిత కాల్స్!