Trading Scam: పాపం.. సోషల్ మీడియాలో వచ్చే తెలియని వ్యక్తుల పరిచయాలు ఒక్కోసారి జీవితాంతం కోలుకోలేని దెబ్బ తీస్తాయని ఈ ఘటనే నిరూపిస్తోంది. హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీరభద్రరావుకు గతేడాది ఆగస్టులో ‘కోరా’ అనే పేరుతో ఒక మహిళ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తనది సింగపూర్ అని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని నమ్మబలికిన సదరు మహిళ, అతడితో స్నేహం పెంచుకుంది. కొన్ని నెలల పాటు చాటింగ్తో నమ్మకాన్ని సంపాదించి, చివరికి అతడిని భారీ ఇన్వెస్ట్మెంట్ ముచ్చులోకి లాగింది.
నకిలీ స్టోర్.. నమ్మించే మాటలు
తమకు వివిధ దేశాల్లో స్నేహితులు ఉన్నారని, వారంతా ‘ఫేస్బుక్ స్టోర్’లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారని వీరభద్రరావుకు ఆశ చూపింది. తొలుత అతను సందేహించినప్పటికీ, తన స్నేహితుల లాభాల స్క్రీన్ షాట్లు చూపుతూ అతడిని ఒప్పించగలిగింది. ఒక అపరిచిత వ్యక్తి పంపిన APK (Android Package Kit) ఫైల్ను డౌన్లోడ్ చేయడంతో మోసం మొదలైంది. ఆ ఫైల్ ఇన్స్టాల్ చేయగానే ఫోన్లో హూబహూ ఫేస్బుక్ లాంటి యాప్ ప్రత్యక్షమైంది, అది నిజమైన అప్లికేషన్ అని భ్రమపడి తన సమాచారాన్ని ఆ నేరగాళ్లకు అప్పగించాడు.
అంతర్జాతీయ నెట్వర్క్తో మాయాజాలం
ఈ మోసంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, ఒక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కోరా సూచన మేరకు ‘బెల్లా’ అనే మరో జర్మనీ మహిళతో వీరభద్రరావు టచ్లోకి వెళ్లాడు. వస్తువులు కొనుగోలు చేయడం, ట్రేడింగ్ చేయడం వంటి అంశాలపై ఆమె సూచనలు ఇస్తూ, భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య కాలంలో విడతల వారీగా బాధితుడు ఏకంగా రూ. 2.36 కోట్లను వారి ఖాతాల్లోకి మళ్లించాడు.
డిజిటల్ తెరపై లాభాలు.. చేతికి రాని సొమ్ములు
బాధితుడు పెట్టుబడి పెట్టిన యాప్లో అతనికి వస్తున్న లాభాలు భారీగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఆ డబ్బును తన బ్యాంక్ ఖాతాకు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఆపివేశారు. చివరకు తన అసలు పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడంతో, అది ఒక కృత్రిమంగా సృష్టించబడిన ‘డిజిటల్ మాయాజాలం’ అని అతను గ్రహించాడు. అప్పటికే కోట్లాది రూపాయలు నేరగాళ్ల పరమయ్యాయి.
సైబర్ క్రైమ్.. పోలీసుల రంగ ప్రవేశం
తను మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ నిధులు ఏయే ఖాతాలకు వెళ్లాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత లింక్లను, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని, అధిక లాభాల పేరుతో ఆశ చూపే యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: జామ పండ్లు కోసిందని, చిన్నారిని గొలుసులతో కట్టివేసిన రిటైర్డ్ ఆర్మీ అధికారి, వీడియో వైరల్